(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి ప్లాంట్లపై డ్రోన్లతో దాడులు జరిగాయి. అబ్కైక్, ఖురయాస్ రాష్ట్రాల్లోని రెండు ప్లాంట్లపై జరిగిన ఈ దాడులు తమ పనేనని యెమెన్ హౌథీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. డ్రోన్ దాడుల కారణంగా ప్లాంట్లలో మంటలు చెలరేగాయనీ, వాటిని ఆర్పివేసినట్లు సౌదీ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించిందనీ రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.
అబ్కైక్లోని చమురు శుద్ధి ప్లాంట్ ప్రపంచంలోకెల్లా పెద్దది. డ్రోన్ దాడుల్లో ఏమేరకు నష్టం జరిగిందీ, ఎవరన్నా గాయపడిందీ లేనిదీ తెలియరాలేదు. ఈ దాడులు వల్ల వచ్చిన అగ్నిప్రమాదం కారణంగా సౌదీ పెట్రోలియం ఉత్పత్తి ఏమేరకు దెబ్బ తింటుదన్నది కూడా ఇంకా స్పష్టం కాలేదు.
యెమెన్లో హౌథీ తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా ఒక ఏడాదిగా యుద్ధం చేస్తున్నది. వీరికి ఇరాన్ మద్దతు ఉంది. ఇరాన్తో బరాక్ ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా ఉపసంహరించుకున్న నాటినుంచీ ఆ రెండు దేశాల మధ్యా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇప్పుడు హౌథీ డ్రోన్ దాడుల ఫలితంగా పర్షియన్ గల్ఫ్లో ఉద్రిక్తతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Video Courtesy: The Guardian