హైదరాబాద్: హైకోర్టు రిటైర్డు జడ్డి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ సంచలన వీడియో బయటపెట్టారు. తనను చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపిస్తూ.. దానికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆమె బయటపెట్టింది. నూతి రామ్మోహన్ రావు,ఆయన భార్య జయలక్ష్మి,కొడుకు వశిష్ట కలిసి సింధు శర్మపై దాడికి పాల్పడటం అందులో స్పష్టంగా కనిపించింది. పిల్లల ముందే ఆమెను కిందపడేసి దారుణంగా కొట్టారు. చట్టాన్ని కాపాడాల్సిన జడ్జి.. కూతురితో సమానమైన కోడలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.రిటైర్డు జడ్జి నూతి రామ్మోహన్ రావు కూడా విచక్షణా రహితంగా కోడలిపై దాడి చేశారు. ఆమెను కిందపడేసి చేయి విరిసేసి, కాలుతో తొక్కుతూ దాడి చేసినట్లు వీడియోలో ఉంది. ఈ దాడి ఏప్రిల్ 20న జరిగింది.
హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్లో మహిళా సంఘాలతో కలిసి సింధూ శర్మ అత్తింటి ముందు ధర్నాకు దిగారు. దీంతో దిగొచ్చిన రామ్మోహన్ రావు కుటుంబం.. వెంటనే చిన్న కూతురిని అప్పగించారు. 2012లో తనకు పెళ్లయిన నాటి నుంచి ఏడేళ్లుగా తాను ఏడవని రోజు లేదని.. అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నారని సింధు శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలు పుట్టినప్పటినుంచి తనపై వేధింపులు ఎక్కువయ్యాయని.. పెళ్లయిన ఏడేళ్లలో ప్రతీరోజూ వేధింపులేనని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. రామ్మోహన్ రావు తన పలుకుబడిని ఉపయోగించి వాటిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తనపై అత్తింటివారు దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో ఉన్నాయని.. వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. అపోలో ఆస్పత్రిలో ఓ మహిళా డాక్టర్ సింధు శర్మ ఒంటిపై గాయాలను చూసి ఆశ్చర్యపోయారు. చెప్పరాని చోట్ల గోళ్లతో ఆమెను రక్కిన గాయాలు,వీపుపై వాతలు తేలిన గుర్తులు ఉన్నట్టు గుర్తించారు. ఇన్నాళ్లు తనపై ఇంత దాడి జరుగుతున్నా.. తన ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్ కోసమే భరిస్తూ వచ్చానని.. ఇక తనవల్ల కాదని నిర్ణయించుకున్నాకే దాడి దృశ్యాలను బయటపెట్టానని సింధుశర్మ చెప్పారు.