హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న విచారణను హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. ప్రభుత్వ అధికారులు సమర్పించిన లెక్కలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు.. పదాలు వాడారని హైకోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. కార్మికుల తరఫున ప్రతినిధులు, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతా తప్పుల తడకగా ఉందని వ్యాఖ్యానించింది. సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం కనీసం రూ. 47 కోట్లు ఇవ్వాలని కోరితే ప్రభుత్వం నిరాకరించిందని గుర్తు చేసింది ధర్మాసనం. సమ్మెపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసింది. అనంతరం విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
అంతకు ముందు.. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారులే హైకోర్టుకు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా? అని ప్రశ్నించింది. రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించే నివేదిక ఇస్తున్నామని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. అలాగైతే మొదటి నివేదిక పరిశీలించాకుండానే ఇచ్చారా? అని ధర్మాసనం నిలదీసింది. తక్కువ సమయంలో తమ కార్యాలయంలో ఉన్న రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని తమను క్షమించాలని రామకృష్ణారావు కోరారు. క్షమాపణ కోరడం సమాధానం కాదని కోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టులకు వాస్తవాలు చెప్పాలని పేర్కొంది. మంత్రికి సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని… ఆయనకు తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లేనని హైకోర్టు పేర్కొంది. కేబినెట్కి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని… సీఎంకి సైతం తప్పుడు లెక్కలతో స్టేట్మెంట్ ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హైకోర్టు మండిపడింది. 15 ఏళ్ల జడ్జి చరిత్రలో ఇంతగా అబద్ధాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదని సునీల్ శర్మఫై హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అన్నారు. తాను మూడు రాష్ట్రాల్లో పని చేశానని.. హైకోర్టుకు ఇలా ఎవరూ అబద్దాలు చెప్పలేదన్నారు. తమను తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇన్చార్జి ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదంటూ చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.
ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టు తెలిపింది. అయితే, ప్రభుత్వం, ఆర్టీసీ చిత్తశుద్ధితో ముందుకు రావట్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖల అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా లెక్కలు చెబుతున్నారని, ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని పేర్కొంది. హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా అని అధికారులను తీవ్ర స్థాయిలో మందలించింది. ఆర్టీసీకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు… జీహెచ్ఎంసీని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. మీ సమాచారంతో సీఎం, కేబినెట్, ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? అని నిలదీసింది. అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్ ను హైకోర్టు ఆదేశించింది.
ఆర్టీసీ.. షెడ్యూల్ 9 కిందకు వస్తుందని సీఎస్ హైకోర్టుకు తెలిపారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం .. టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేశామని సీఎస్, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ పేర్కొన్నారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగులో ఉందని ఏజీ తెలిపారు. ఆర్టీసీ విభజన పెండింగ్లో ఉందంటూనే.. కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామని ఎలా చెబుతారని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం ఆమోదం లేకుండా.. రెండు కొత్త సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తారని హైకోర్టు నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉందని తెలిపారు. ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని కేంద్రం తరపు లాయర్ పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీకి ఆటోమేటిక్గా బదిలీ కాదని కేంద్ర ప్రభుత్వం వాదన వినిపించింది. ఆర్టీసీ రీఆర్గనైజేషన్కు తమ అనుమతి కోరలేదని కేంద్రం పేర్కొంది.