ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక రోజు మాత్రమే ఉండటంతో శివసేన తన పార్టీ ఎమ్మెల్యేలను ముంబైలోని ఓ హోటల్ కు తరలించింది. అసెంబ్లీ గడువు రేపటితో ముగియనుండటంతో పార్టీలు చకచకా పావులు కదుపుతున్నాయి. గవర్నర్ ను బీజేపీ నేతలు కలిసిన వేళ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శివసేన జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా వారిని ముంబైలోని ఓ హోటల్ కు తరలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలను ఆపార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఖండించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని, అయినా వారి జోలికొచ్చే సాహసం ఎవరూ చేయబోరని వ్యాఖ్యానించారు. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నవారు తమ సొంత పార్టీ ఎమ్మెల్యేల గురించి ముందు ఆందోళన చెందాలని సూచించారు. శివసేనకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠిస్తారని సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలందరూ కలిసి ఉండటం అవసరమని, పార్టీ అధినేత ఉద్ధవ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి అందరూ కట్టుబడి ఉండాలని శివసేన ఎమ్మెల్యే సునీల్ ప్రభు అన్నారు.
ఇక రేపటిలోగా ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలంటూ గత కొన్ని రోజులుగా శివసేన డిమాండ్ చేయడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ- శివసేన పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ప్రత్యామ్నయ మార్గాలు అన్వేషించిన శివసేన.. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావించింది. అయితే, తాము ప్రతిపక్షంలోనే కూర్చంటామని, శివసేనకు మద్దుతు ఇచ్చేది లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేసినా.. శివసేన మాత్రం తమ పంతం వీడడం లేదు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. గత నెల 24న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 సీట్లను గెలుచుకున్నాయి. అయిదుగురు ఇండిపెండెంట్లు మద్దతివ్వడంతో శివసేన బలం 61కి పెరిగింది. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందాయి. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం నవంబర్-8, 2019తో ముగుస్తుంది. అప్పటిలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.