(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామన్న జేఏసీ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కరుణిస్తుందా ? తిరిగి విధుల్లో చేర్చుకొనేందుకు సమ్మతిస్తుందా ? ప్రభుత్వం ఆర్టీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న అంశం అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో మరోసారి సమావేశమై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు సమస్యలు పరిష్కరించాలంటూ గత అక్టోబర్ 5వ తేదీ నుంచి దాదాపు 50వేల మంది కార్మికులు సమ్మెకు దిగారు. విధుల్లో చేరాలని ప్రభుత్వం రెండుసార్లు గడువు విధించినా కార్మికులు స్పందించలేదు. నెలన్నరకు పైగా జీతాలను ఫణంగా పెట్టి సమ్మె చేశారు. దీంతో కార్మికుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. సమ్మె కాలంలో పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్ని ధర్నాలు చేసినా, సమ్మెలు చేసినా ప్రభుత్వం మాత్రం స్పందించ లేదు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పంది. ఇదే క్రమంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో న్యాయ జరుగుతుందని భావించిన కార్మికులు అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. ఆర్టీసీ అంశం లేబర్ కోర్టుకు రావడం, జీతాలు లేక కార్మికుల ఆర్థిక కష్టాలు రెట్టింపు కావడంతో యూనియన్లు వెనక్కి తగ్గాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం నుంచి హామీ తీసుకున్న తర్వాతే సమ్మెను విరమించాలని నిర్ణయించుకున్నారు.
ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకుంటేనే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోరారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. హైకోర్టు ఉత్తర్వులు, మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమణకు ఒప్పుకోవడంతో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకుంటారా ? లేక ముందుగా ప్రకటిచినట్లు ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారన్న ప్రకటనకు కట్టుబడి ఉంటారా ? అన్నది ఉత్కంఠగా మారింది.