న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ హత్యోదంతం పార్లమెంట్లోను కుదిపేసింది. ఈ ఘటనను రాజ్యసభలో పలువురు సభ్యులు తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు కఠినంగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై నేరాలు ఆగడం లేదని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ అన్నారు. ఈ అంశంపై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీందర్కుమార్ మాట్లాడుతూ.. జీరో ఎఫ్ఐఆర్పై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుచేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కనబడుతోందని, పరిధితో సంబంధం లేకుండా కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు.
అన్నాడీఎంకే ఎంపీ విజయ్ సత్యానంద మాట్లాడుతూ… డిసెంబరు 31లోపు నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకోలేకపోయారని, ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని ఎంపీ ఎంఏ ఖాన్ కోరారు. ఒకే అంశంపై అనేకసార్లు మాట్లాడటంపై దేశం మొత్తం సిగ్గుపడాలని జయాబచ్చన్ అన్నారు. “ఇటువంటి కామాంధులను ప్రజలకు అప్పగించాలి. అప్పుడు ప్రజలే వారిపై మూకదాడి చేసి చంపేస్తారు. జరుగుతున్న ఘోరాలపై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు” అని ఆమె వ్యాఖ్యానించారు. కుమార్తెలను బయటకు పంపడానికి తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉందని ఏండీఎంకే ఎంపీ వైగో పేర్కొన్నారు.
నిందితులకు 15 నుంచి 20 రోజుల్లో శిక్షపడేలా చూడాలని కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి కోరారు. న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని అన్నారు. దేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, కింది కోర్టులను వేసిన శిక్షలను ఉన్నత న్యాయస్థానాలు తగ్గిస్తున్నాయని ఎంపీ బండ ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్ డిమాండ్ చేశారు. నలుగురు నిందితులకు డిసెంబరు 31లోగా ఉరి శిక్ష వేయాలని అన్నారు. శిక్షలు వెంటనే అమలు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దిశ ఘటనపై లోక్ సభలోనూ చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎంపీలతోపాటు పలు పార్టీల నేతలు ఈ అంశంపై మాట్లాడారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ‘క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్య పర్చడంలో ప్రభుత్వ వ్యవస్థ విఫలమవుతోంది. వెంటనే శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటి ఘటనలు మరోసారి జరగవు. సంవత్సరాల కొద్దీ విచారణలు జరగకూడదు’ అని పలువురు ఎంపీలు వ్యాఖ్యానించారు.
శంషాబాద్ సమీపంలో నవంబర్ 27న దిశ (వెటర్నరీ డాక్టర్)ను ట్రాప్ చేసిన నలుగురు యువకులు, ఆమెను దారుణంగా రేప్ చేసి, చంపేసి, పెట్రోల్ పోసి తగులబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా మరో ‘నిర్భయ’ను గుర్తుకు తెచ్చింది. నిందితులకు ఉరి శిక్ష వేయాలని, దేశం యావత్తూ దిశ కుటుంబానికి న్యాయం చేయాలని నినదిస్తోంది.