అమరావతి: రాజధాని అమరావతి ఇష్యూని లైవ్లో ఉంచాలని టిడిపి ప్రయత్నం చేస్తున్నది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి డోలాయమానంలో పడిన విషయం తెలిసిందే. అమరావతి నుండి రాజధాని తరలిపోతుందన్న విధంగా మంత్రుల నోట వచ్చిన వ్యాఖ్యలు రాజధాని అంశాన్ని అయోమయంలోకి నెట్టాయి. దీనికి తోడు రాజధానిపై అభిప్రాయ సేకరణకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో రాజధాని తరలిపోతుందన్న భావన బలపడింది.
రాజధాని విషయంలో ఇటీవల సిఎం జగన్ కొంత సానుకూలంగా మాట్లడినప్పటికీ పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన సంకేతాల కారణంగానే జగన్మోహనరెడ్డి రాజధాని విషయంలో తన వైఖరి మార్చుకున్నారా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అమరావతిలో ప్రాధాన్యతా నిర్మాణాలు కొనసాగించాలనీ, భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలనీ కూడా అధికార యంత్రాంగాన్ని జగన్ ఆదేశించారు. నిపుణుల కమిటీ నివేదిక అందిన తరువాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని అంశంపై చర్చను కొనసాగించాలి టిడిపి భావిస్తోంది.
ఈ నెల అయిదున విజయవాడలో వివిధ రాజకీయ పక్షాలు, మేధావులతో టిడిపి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది.
ఈ సమావేశానికి ఎవరెవరిని ఆహ్వానించాలి అనే విషయాలపై టిడిపి నేతలు సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు.