న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు ఖరారు అయినట్లు తెలుస్తోంది.ఈనెల16 వ తేదీ ఉదయం అయిదు గంటలకు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలుకు తీహార్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు ఉన్న తీహార్ జైలులోనే ఉరి తీయనున్నట్లు తెలిసింది. దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ రాష్ట్రపతికి చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు.దీంతో ఉరిశిక్షకు లైన్ క్లియర్ అయ్యింది.
2012 డిసెంబర్ 16న ఆరుగురు కలిసి నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్ 16వ తేదీనే నలుగురు దోషులను ఉరి తీస్తుండటం విశేషం. దోషుల్లో ఒకరు జూవైనల్ కస్టడీలో ఉండగా, మరొక దోషి రామ్సింగ్ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే.
ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ అనంతరం ప్రజల దృష్టి నిర్భయ ఘటన దోషులపైకి మళ్లింది. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లకు పైగా గడుస్తున్నా దోషులకు పడిన ఉరిశిక్షను ఎందుకు అమలు చేయడం లేదని మహిళా సంఘాలతో సహా పలువురు ప్రముఖులూ ప్రశ్నిస్తున్నారు. శిక్ష అమలు కాకపోవడంపై ఇటీవల నిర్భయ తల్లి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఉరి శిక్ష అమలు నిర్ణయంతో వారి డిమాండ్ నెరవేరనుంది.
ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా ఉరితాళ్లు తయారు చేస్తున్న బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జైలుకు ఈ నెల 14వ తేదీలోగా పది ఉరితాళ్లను సిద్ధం చేయాలని జైళ్ల శాఖ డైరెక్టరేట్ నుండి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ ఉరితాళ్లకు ఎక్కడకు పంపిస్తారనేది తమకు తెలియదని జైలు సూపర్నిటెండెంట్ విజయ్కుమార్ అరోరా తెలిపారు. బక్సర్ జైలుకు ఉరితాళ్లను సిద్ధం చేయాలని సమాచారం రావడంతో నిర్బయ దోషులను ఉరి తీయడానికే అయి ఉండవచ్చని భావిస్తున్నారు.