(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వివాహాది కార్యక్రమాల్లో వధూవరులకు దండలుగా మారుతున్నాయి. తాజాగా యూపీలోని వారణాసిలో జరిగిన ఓ పెళ్లిలో వధూవరులు ఉల్లి, వెల్లులిపాయలతో తయారు చేసిన దండలను మార్చుకున్నారు. పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుడికి భారమైన నేపథ్యంలో ఈ పెళ్లి ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. వధూవరులకు ఉల్లి, వెల్లులి పాయల దండలు, ఉల్లి పాయల బుట్టలను వధూవరులకు ఇచ్చారు. దీంతో వివాహానికి వచ్చిన వారందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీ నేత కమల్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘ఉల్లి ధరలు కిలో రూ.120కు పెరిగాయి. దీంతో ప్రజలు ఉల్లిని బంగారంతో సమానంగా భావిస్తున్నారు. అందుకే వధూవరులు విలువైన ఉల్లిని దండలుగా మార్చుకున్నారు’’ అని తెలిపారు.
ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల జోకులు వేస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ పెళ్లిలో స్నేహితులంతా కలిసి కొత్త జంటకు ఉల్లి పాయాల బొకేను కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా ఉల్లి ధర కిలోకి రూ.100 పైనే ఉంది. ప్రభుత్వం మాత్రం ఉల్లి ధరలను అదుపు చేయడంలో విఫలమవుతోంది. ఉల్లి ధరలు నేలకు దిగి రావడం లేదు. ఉల్లి ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కొంతమంది ఉల్లిని బంగారంతో పోల్చితే.. మరికొందరు వినూత్నంగా బహుమతుల రూపంలో ఉల్లిని ఇస్తున్నారు.