విజయవాడ: ఏపి రాజధానిని అమరావతిని మార్పు చేసే ప్రతిపాదన ఏమి లేదని శాసనమండలి సాక్షిగా వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం విడ్డూరంగా ఉందని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇది ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు.
ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. శాసనసభను అసత్య ప్రచారాలకు వేదికగా చేసుకోవడం సరికాదని అన్నారు. రాజధానికి అడ్డుపడుతూ వైసిపి నేతలు చారిత్రక తప్పిదం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయని సత్య ప్రసాద్ ప్రశ్నించారు.
హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతర భవనాలకు పార్టీ రంగులు వేయడం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రతీకారంపై చూపిస్తున్న శ్రద్ధ పాలనపై చూపడం లేదని సత్యప్రసాద్ విమర్శించారు.