(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, జేఎంఎం కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకు వెళుతోంది. మొత్తం 81 స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్, జేఎంఎం కూటమి 45 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ అభ్యర్ధులు 26 చోట్ల మాత్రమే ఆదిక్యతలో ఉన్నారు. ఏజేఎస్ యూ 3, జేవీఎం 3, ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
జార్ఖండ్లో అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న మొదటి ముఖ్యమంత్రి రఘువర్ దాస్ చివరికి పరాజయాన్ని అంగీకరించారు. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్లో అధికారం చేపట్టాలంటే 41 సాధించాలి. కాంగ్రెస్ కూటమి దీనికి మించి సీట్లు సాధించి అధికారం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కూటమి తరపున జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించే జేఎంఎ నేత హేమంత్ సొరేన్ విజయం ఖాయమయిన వెంటనే వెళ్లి తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి శిబు సొరేన్ ఆశీస్సులు తీసుకున్నారు.
ఎన్నికలలో విజయం సాధించడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంగా జరిపే ప్రచారానికి పరిమితులు ఉన్నాయని జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ప్రధానంగా రాష్ట్రంలో బీజేపీ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టం, ఎన్నార్సీపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసొచ్చిందని కాంగ్రెస్, జేఎంఎం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు సాధించి కూడా అధికారాన్ని చేపట్టలేకపోయిన బీజేపీ, తమ ఏలుబడిలో ఉన్న మరో రాష్ట్రంలో అధికారానికి దూరం అవ్వడం జీర్ణించుకోలేని పరిణామం. తాము ఏం చేసినా ప్రజల మద్దతు తమకే ఉంటుందని భావిస్తున్న ఢిల్లీ పెద్దలను ఈ తీర్పు ఒకింత ఆలోచనలో పడేసేదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.