(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తుళ్లూరు: అమరావతిలో రైతులందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన తుళ్లూరులో పర్యటించారు. ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తుళ్లూరులో రైతులు చేస్తున్న మహాధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమరావతిలో రైతులు ప్రథమ పౌరులుగా ఉండాలని ఆలోచించామని, అయితే రైతులు భార్యా పిల్లలతో రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారని చంద్రబాబు చెప్పారు. ఎప్పుడూ ఇళ్లలో నుంచి బయటకు రాని మహిళలు రోడ్డుపైకి వచ్చారన్న ఆయన పనులు వదిలి ఆందోళనలు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు.
అమరావతి ఓ మహానగరం అవుతుందని భావించానని, చర్రితలో నిలిచిపోతుందని అనుకున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే.. రైతులు 33 వేల ఎకరాల భూములను రాజధాని కోసం ఇచ్చారన్నారు. రైతులకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతోనే ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ ప్రకటించామన్నారు. నాడు సీఎం హోదాలో తాను హామీ ఇస్తే.. ఇప్పుడు జగన్ సర్కారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఎవరు అధికారంలోకి వచ్చినా అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల త్యాగాలతోనే రాజధాని కడతామని నాడు చెప్పామని, ఇక్కడి భూమిపై వచ్చే ఆదాయంతోనే రాజధాని కట్టొచ్చని చెప్పారు. వైసీపీ ఈ విషయాన్ని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, హైకోర్టు మాత్రమే అమరావతి ఉంటే అభివృద్ధి చెందదన్న బాబు.. అమరావతిపై వచ్చింది జీఎన్ రావు కమిటీ రిపోర్టు కాదు… జగన్ నివేదిక అని మండిపడ్డారు. రూపాయి ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణాన్ని తాను ప్రారంభించానని గుర్తు చేశారు. అభివృద్ధితో సంపద పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు.
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించడం కోసం జగన్.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతారా? అని సవాల్ విసిరారు. అమరావతిలో ఒక్క ఎకరా కూడా ముంపునకు గురికాదని చెప్పారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకుందామని, ఇప్పుడు అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీకి ఉన్న విశ్వసనీయత ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఎవరిని అడిగి ఆ నివేదిక రూపొందించారని నిలదీశారు. సీఎం పేపర్ లీక్ చేస్తే జీఎన్ రావు పరీక్ష రాసినట్లుందని వ్యాఖ్యానించారు. ఎక్కడైనా అసెంబ్లీ, సచివాలయం, మంత్రులు, సీఎం, గవర్నర్ నివాసాలు వేర్వేరుగా ఉన్నాయా అని ప్రశ్నించారు.
రాజధాని అంశంపై గతంలో అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు నాటి ప్రతిపక్ష నేత జగన్ విజయవాడలో రాజధానిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారని.. రాజధానికి 30 వేల ఎకరాలు ఉండాలని సూచించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి ఎందుకు మాటతప్పారని ప్రశ్నించారు. విశాఖ ప్రజల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని, కానీ అమరావతిలో రైతులకు ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. విశాఖను నాలెడ్జ్ హబ్ గా, ఐటీ రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేశామని, కానీ అన్నింటిని అడ్డుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.