అమరావతి: పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన రాజధాని రైతులను పరామర్శించేందుకు వెళ్లాలని భావించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ విషయమై న్యాయపరమైన చర్యలకు దిగుతామని జనసేన పార్టీ న్యాయ విభాగం ప్రకటించింది. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో పార్టీ రాష్ట్ర న్యాయ విభాగం మంగళవారం సమావేశం నిర్వహించింది.
పోలీసు అధికారులు అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయంలోకి చొరబడటమే కాకుండా, పవన్ కల్యాణ్ ని, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు నాయకులను నిర్భందించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. ఐదు గంటలపాటు అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా వారిని నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. ఒక పార్టీ అధ్యక్షుడిని వారి కార్యాలయంలోనే నిర్బంధించడం రాజ్యాంగ విలువలకు, వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. గాయపడిన రైతులను పరామర్శించనీయకుండా నియంత్రించడం ప్రజాస్వామ్య విలువలను మంటగలపడమేనని విమర్శించింది.