అమరావతి: ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష టీడీపీ పంతం నెగ్గింది. రూల్ 71పై చర్చకు ఛైర్మన్ షరీఫ్ అనుమతించారు. అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టారు. ఉదయం నుంచి జరిగిన హైడ్రామా తర్వాత మండలి ఛైర్మన్ బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు. మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరూ బిల్లులను ప్రవేశపెట్టారు.
ఏపీ శాసనసభ ఆమోదం పొందిన రెండు బిల్లులను శాసనమండలిలో కూడా ఆమోదింపజేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. అయితే, టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రూల్ నెంబర్ 71 ప్రకారం తాము ప్రతిపాదించిన అంశంపై తొలుత చర్చించాలని ప్రతిపక్ష టీడీపీ పట్టుబట్టింది. అయితే, రూల్ 71 సరికాదని, ముందు ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలంటూ వైసీపీ నేతలు పట్టుబట్టారు. ఈ క్రమంలో శాసనమండలి పలుమార్లు వాయిదా పడింది. చివరకు ఏడు గంటల హైడ్రామా అనంతరం సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు చైర్మన్ షరీఫ్ అంగీకరించారు. దీంతో ఛైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. రూల్ 71పై చర్చకు నోటీసు ఇచ్చినా బిల్లును పరిగణనలోకి తీసుకోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఛైర్మన్.. రూల్ 71పై చర్చ ప్రారంభించాలని సూచించారు.దీంతో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చర్చను ప్రారంభించారు. రూల్ 71పై చర్చకు రెండు గంటల సమయాన్ని చైర్మన్ కేటాయించారు.