Badvel By Poll: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30వ తేదీన బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుండగా, నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ ఇంతకు ముందే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్ ను అభ్యర్థిగా ప్రకటించింది. నిన్న వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి సుధను వైసీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.
Badvel By Poll: జనసేనతో చర్చించే నిర్ణయం
అయితే ఇక్కడి ఎన్నికల్లో బీజేపీ – జనసేన అభ్యర్థిని నిలుపుతుందా లేదా అన్న ఊహగానాలు సాగుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు క్లారిటీ ఇచ్చారు. తమ మిత్రపక్షమైన జనసేనతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు సోము వీర్రాజు. బద్వేల్ లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలా లేక జనసేన అభ్యర్థి పోటీ చేయడమా అనేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ రోజు జనసేన నిర్వహించే సమావేశంలో బద్వేల్ ఉప ఎన్నికల అంశంపై వారు చర్చిస్తారని సోము వీర్రాజు అన్నారు. అయితే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘోర ఓటమి చవి చూసిన బీజేపీ ఈ సారి బద్వేల్ లో పోటీకి సిద్దంగా లేదన్నట్లు తెలుస్తోంది. అందుకే జనసేనకు వదిలివేయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లోనూ బద్వేల్ లో బీజేపీ, జనసేన పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలపలేదు.
ఈ కారణంతో జనసేన, బీజేపీ పోటీ చేయకపోవచ్చు
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గుంతోటి వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల ఆధిక్యతతో ఓబులాపురం రాజశేఖర్ పై విజయం సాధించారు. వెంకట సుబ్బయ్యకు 95,482 ఓట్లు రాగా రాజశేఖర్ కు 50,748 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి నీరుగట్టు దొర విజయ జ్యోతికి 2,883 ఓట్లు, నోటాకు 2,004 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. గడచిన ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులు పోటీ చేయనందున ఈ ఉప ఎన్నికలోనూ పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో ఆయా పార్టీల నుండి పోటీ చేయడానికి పెద్దగా ఆశించే నాయకులు లేకపోవడంతో అంతగా దృష్టి సారించడం లేదని సమాచారం. జనసేన నిర్ణయం కూడా దీనిపై ఒకటి రెండు రోజుల్లో వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
Read more: Harirama Jogaiah: ఏపి సీఎం జగన్ పై సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య కీలక వ్యాఖ్యలు