CM YS Jagan: కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ -1 పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు వివరించారు. ఆసుపత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నాయని వెల్లడించారు.
డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవు అని తెలిపారు. అయితే జేఎన్ 1 కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని చెప్పారు. లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. పాజిటివ్ వచ్చిన సాంపిల్స్ ను విజయవాడ జీనోమ్ ల్యాబ్ లో పరీక్షిస్తున్నామనీ, కొత్త వేరియంట్ల ను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నామన్నారు. అదే విధంగా ఆసుపత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ ఫ్రాను సిద్దం చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ .. ఈ వేరియంట్ వల్ల ఆందోళన లేకపోయినా ముందస్తు చర్యల పట్ల దృష్టి పెట్టాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయాలన్నారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్ స్టాఫ్ కు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
IRR Case: లోకేష్ అరెస్టునకు న్యాయస్థానాల్లో సీఐడీ మెమో .. విచారణ రేపటికి వాయిదా