YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 23వ తేదీ నుండి మూడు రోజుల పాటు తన సొంత జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ప్రతి ఏటా క్రిస్మస్ పండుగకు రెండు మూడు రోజుల ముందు సీఎం జగన్ స్వగ్రామం పులివెందులకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. కడప పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు కొన్ని పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొంటారు. ఈ మేరకు సీఎంవో అధికారులు సీఎం జగన్ షెడ్యుల్ ను ఖరారు చేశారు.
23వ తేదీ ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి లోని నివాసం నుండి గన్నవరం చేరుకుని అక్కడ నుండి నేరుగా కడప చేరుకుంటారు. కడప ఎయిర్ పోర్టులో అక్కడి ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు, అధికారులు స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత గోపవరం చేరుకుని సెంచురీ ఫ్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్ పీ ఎల్ ప్లాంట్ లను ప్రారంభించనున్నారు. ఆ సంస్థకు చెందిన చైర్మన్ తో పాటు అందులో పని చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడనున్నారు.
అక్కడ నుండి రిమ్స్ హాస్పటల్ కు చేరుకుని డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డాక్టర్ వైఎస్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ యూనిట్, డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రితో పాటు రిమ్స్ సమీపంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత నవీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, సుందరంగా తీర్చిదిద్దిన అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్స్ కు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత నేరుగా ఇడుపులపాయ లోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ కు చేరుకుని ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
24న ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుండి నేరుగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో పాటు కడప నగర మేయర్ సురేష్ బాబు, పలువురు ముఖ్యనేతలు పాల్గొంటారు. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ ప్రారంభోత్సవం చేస్తారు. తిరిగి సాయంత్రం ఇడుపులపాయ ఎకో పార్క్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీటీసీలు ఇతర స్థానిక నేతలతో మాటా మంతి నిర్వహిస్తారు. తిరిగి వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ కు చేరుకుని బస చేస్తారు. 25న ఉదయం ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. అక్కడ సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
YS Jagan: వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్