ఏ రాజకీయ పార్టీలో అయినా పార్టీ అధినేతను కార్యకర్తలు, నేతలు కలుసుకోవడం ఓ మధురానుభూతిగా భావిస్తుంటారు. అధినేత ఏదైనా కార్యక్రమానికి వచ్చిన సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కార్యకర్తలు పోటీపడుతుంటారు. నాయకుడితో సెల్పీ ఫోటోలు దిగి ఆనందిస్తుంటారు. ఏ రాజకీయ పార్టీకి అయినా కార్యకర్తలే పట్టుగొమ్మలు. నాయకులు తమ తమ అవసరాల రీత్యా పార్టీలు మారుతుంటారు. కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తుంటారు.ఇటువంటి కార్యకర్తలు తమ అధినాయకుడిని కలవడం ఒక కలే.
కానీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అటువంటి సిన్సియర్ కార్యకర్తల కల నెరవేర్చేందుకు నూతన కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నారు. ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపాయింట్మెంట్ లభించడం లేదన్న అపవాదు ఉంది. ఈ తరుణంలో నియోజకవర్గ ఇన్ చార్జి, ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గ పరిధిలోని సిన్సియర్ కార్యకర్తలతో సమావేశాలకు సీఎం జగన్ ప్లాన్ చేశారు. కార్యకర్తలతో భేటీ కావాలని సీఎం వైఎస్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆగస్టు 4వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గ కార్యకర్తలతో తాను సమావేశం అవుతానని గతంలోనే ప్రకటించారు జగన్.
అయితే ముందుగా రేపు (ఆగస్టు 4) చంద్రబాబు నాయడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం సమయంలో ఈ భేటీ జరుగుతుంది. ఈ భేటీలో ప్రధానంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, పురోగతి, బలోపేతం తదితర విషయాలపై చర్చించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి, ప్రతిపక్షాల విమర్శలను ఏ విధంగా తిప్పి కొట్టాలి తదితర విషయాలపై నేరుగా కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ తరహా కార్యక్రమం ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదు. జగన్మోహనరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్యకర్తలు చాలా హాపీగా ఫీల్ అవుతున్నారు. తమ నియోజకవర్గం వంతు ఎప్పుడు వస్తుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలకు అరుదైన అవకాశం లభిస్తొంది.
ఏపి సీఎం జగన్, చిన్న జీయర్ తో సంబంధాలు..? చీకోటి ప్రవీణ్ ఇచ్చిన క్లారిటీ ఇదీ