ఏపిలో భూ వివాదాల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువ భూ వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. భూ వివాదాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పరస్పర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భురక్ష పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం సీఎం జగన్ ఈ పథకంపై సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి మండల కేంద్రంలో భూవివాదాల పరిష్కారానికి ట్రబ్యునల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పథకం కింద సమగ్ర సర్వే పూర్తి చేసిన తరువాత శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునళ్లు కొనసాగించాలన్నారు. సర్వే సమయంలో వివాదాల పరిష్కారానికి యంత్రాంగం ఉండాలనీ, మొబైల్ ట్రైబ్యునల్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సమగ్ర సర్వే లో వచ్చే అప్పీళ్లపై థర్డ్ పార్టీ పర్యవేక్షణ ఉండాలన్నారు. వ్యక్తిగతంగా భూమి సర్వే కోసం ధరఖాస్తు చేస్తే కఛ్చితంగా చేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలో లోగా సర్వే చేయకుంటే సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం జగన్ హెచ్చరించారు.
నెలకు వెయ్యి గ్రామాల చొప్పున చేస్తున్న లక్ష్యాన్ని పెంచాలని ఈ సందర్భంగా సూచించారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో సర్వే వేగవంతం చేయాలని చెప్పారు. సమగ్ర సర్వే కోసం లీగల్ సంస్థల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వే పూర్తి అయ్యే నాటికి రిజిస్ట్రేషన్ సదుపాయం రావాలని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సమగ్ర సర్వే పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్ కు తెలియజేశారు.
మోడీ ఇలాకాలో జెండా పాతేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ కీలక హామీలు