IPS AB Venkateshwara Rao: రెండేళ్లకు పైగా సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో గత నెలలో సస్పెన్షన్ ఎత్తివేస్తూ జీఏడి లో రిపోర్టు చేయమని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. నేడు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ సర్వీస్ డిపార్ట్ మెంట్ కు కమిషనర్ గా ఏబి వెంకటేశ్వరరావు ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వహిస్తున్న విజయకుమార్ కు హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏబి వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హోంశాఖలో పరికరాల కొనుగోలులో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్ పై అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ తరువాత ఏబీ వెంకటేశ్వరరావు ఏపి హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆయనను విధుల్లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఆరు నెలల చొప్పున రెండేళ్లకు పైగా ఆయన సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. తదుపరి ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించగా రెండేళ్లకు పైగా సివిల్ సర్వీస్ అధికారిని సస్పెన్షన్ లో కొనసాగించకూడదన్న నిబంధన మేరకు ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు పలు మార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. సీఎస్ ను కలిసేందుకు వెళ్లిన సందర్భంలోనూ ఏబీ వెంకటేశ్వరరావుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు అప్పట్లోనే మీడియాకు వెల్లడించారు. ఆ తరువాత సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పోస్టింగ్ కొరకు కూడా ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి లేఖలు రాశారు. అదే క్రమంలో తన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ తప్పులు ఉన్నాయనీ, ఈ ఏడాది మార్చి నెల నుండే సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారనీ, దాన్ని సరి చేయాలని కోరారు.