Chandra Babu: కర్నూలు జిల్లా కోసిగి మండలం బొంపల్లెలో టీడీపీ నేత తిక్కారెడ్డి పై ప్రత్యర్ధులు దాడి చేశారు. ఈ దాడిలో తిక్కారెడ్డితో పాటు మరో అయిదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనపై టీడీపి అధినేత చంద్రబాబు స్పందిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. టీడీపీ నేత తిక్కారెడ్డి పై దాడి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తిక్కారెడ్డిపై వైసీపీ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ మూకలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఏపిలో శాంతిభద్రతలు కుప్పకూలి శిధిలావస్థకు చేరాయని చంద్రబాబు విమర్శించారు.
Chandra Babu: ప్రభుత్వానిదే బాధ్యత
రాష్ట్రంలో నేరస్తులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారు నేరాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రోత్సాహంతోనే టీడీపీ నేతలు, సానుభూతిపరులపై అసాంఘీక శక్తులు దాడులకు తెగబడుతున్నాయని అన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో తిక్కారెడ్డిపై వైసీపీ గుండాలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని గుర్తు చేస్తూ తిక్కారెడ్డికి అధికార పార్టీ నుండి ప్రాణ హాని, ఆయన ఆస్తులకు ముప్పు ఉన్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయాన్ని కల్గిస్తోందన్నారు. తిక్కారెడ్డిపై ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు.
తిక్కారెడ్డి ఇటీవల కోసిగి మండలం పెద్దభూంపల్లిలో ఆంజనేయస్వామి రధోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో అదుగురు కార్యకర్తలు గాయపడ్డారు. తిక్కారెడ్డిపై జరిగిన దాడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తిక్కారెడ్డికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.