CJI Justice NV Ramana: అమరావతి నేలపాడులోని హైకోర్టులో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఘనంగా సత్కరించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు దారి పొడవునా రాజధానికి భూములు రైతులు ఇచ్చిన రైతులు మానవహారంగా ఏర్పడి జస్టిస్ ఎన్వీ రమణకు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. ప్లకార్డులు, జాతీయ జండాలు చేబూని స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం హైకోర్టులో జస్టిస్ రమణ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నర్సింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఘంటా రామారావు, జానకి రామిరెడ్డి, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
CJI Justice NV Ramana: జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
అంతకు ముందు సిద్ధార్ధ బిటెక్ కళాశాలలో జస్టిస్ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాస సభలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. జస్టిస్ వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా న్యాయవ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. వ్యక్తుల స్వేచ్చను కాపాడటంలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఎగ్జిక్యూటివ్, శాసన వ్యవస్థలో ఉల్లంఘనలు జరిగితే దాన్ని సరిదిద్దే పాత్ర న్యాయవ్యవస్థదేనన్నారు. పాలకులు చట్టాలు చేసే ముందు న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, చట్టం రాజ్యాంగ బద్దంగా ఉందా లేదా అనేది సమీక్షించుకోవాలని సూచించారు.