Harish Rao తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇటీవల ఏపీ ప్రభుత్వంపై కామెంట్లు చేయడం తెలిసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రాలో పాలన బాగోలేదని అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని సూచించారు. అభివృద్ధిలో ఆంధ్రకు తెలంగాణకు ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉందని తెలిపారు. దీంతో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు గట్టిగానే కౌంటర్లు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే నేడు మరోసారి ఏపీలో ప్రభుత్వం పై ప్రతిపక్షాలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పటికి లేనట్టేనని కేంద్రం ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటనపై BRS నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కెసిఆర్ ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం వెనకడుగు వేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కెసిఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మటం లేదు బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించిన దాన్ని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ సాధించిన విజయం… ఇది బీఆర్ఎస్ విజయం… ఇది ఏపీ ప్రజల విజయం… ఇది విశాఖ కార్మికుల విజయం అని ఉద్ఘాటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేసీఆర్, కేటీఆర్, తాను మాట్లాడినట్లు స్పష్టం చేశారు.
కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఏపీలో అధికార పార్టీ విపక్షాలు నోరు విప్పలేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై పోరాడుతామని..ఏపీ ప్రజలు, కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BRS పోటీ చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నీ నియమించడం జరిగింది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీలో ఏ పార్టీ కూడా పోరాడలేదని BRS మాత్రమే పోరాడినట్లు చెప్పటం తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది.