ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అసలే ఎన్నికల సమయం కూడా దీనికి తోడవడంతో మరింత కాక రేపుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీల మధ్య మాటల యుద్ధం రాటు దేలుతోంది. పార్టీల అధినేతలే.. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు.. సీఎం జగన్ పాలనను, ఆయన పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. అరాచక పాలన సాగుతోందని.. తాను వస్తే.. మంచి పాలన అందిస్తానని చెబుతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగిస్తానని కూడా చెబుతున్నారు.
ఇక, పించనును రూ.4000 చేస్తానని చంద్రబాబు గత నాలుగు రోజులుగా చెబుతున్నారు. అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి.. ప్రస్తుతం పింఛను తీసుకుంటున్న వారికి కూడా దీనిని అమలు చేస్తామని చిత్రమైన వాదన తెచ్చారు. అంటే, చంద్రబాబు ఉద్దేశం ప్రకారం.. ఏప్రిల్ నుంచే రూ.4000 చొప్పున పింఛను అమలు చేయనున్నారు. దీనిలో ప్రస్తుత ప్రభుత్వం రూ.3000 ఇస్తుండగా.. మిగిలిన రూ.1000ని తాను అధికారంలోకి వచ్చాక లెక్కగట్టి (ఏప్రిల్+మే+జూన్) మూడు మాసాలది జూలైలో ఇస్తానని చంద్రబాబు చెప్పారు.
ఇక, కామన్గా మారిపోయిన వివేకానందరెడ్డి హత్య.. జగన్ కోడికత్తి.. అనంతబాబు శవం డోర్ డెలివరీ.. సుధాకర్ మృతి ఇలా కొన్నింటిని ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు చెబుతున్నారు. అయితే.. జగన్ విషయానికి వస్తే.. చెప్పిన మాటను ఎక్కడా చెప్పడం లేదు. ఒక చోట చేసిన విమర్శలు మరో చోట చేయడం లేదు. దీంతో జగన్ ప్రసంగాల్లో కొత్తదనం కనిపిస్తోంది. అదేసమయంలో చంద్రబాబును ఆయన చేస్తున్న టార్గెట్ కూడా.. రోజు రోజుకు మారుతోంది. `ఏదైనా గుర్తుండిపోయే ఒక్క పథకమైనా ఉందా చంద్రబాబూ` అనే మాట కొన్నాళ్లు వినిపించారు. తర్వాత.. దీనిని వదిలేసి.. తన పథకాలను ఏకరువు పెట్టారు.
వీటిలోనూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. తానకు పేదలకు మధ్య ఫెవికాల్ బంధం ఉందని జగన్ చెబుతున్నారు. వలంటీర్ వ్యవస్థను దీనికి ఉదాహరణగా పేర్కొంటున్నారు. అంతేకాదు.. ఇలాంటి బంధం చంద్రబాబుకు ఉందా? అనేది జగన్ సంధిస్తున్న ప్రధాన ప్రశ్న. ఇది క్షేత్రస్థాయిలో పెను చర్చకు దారితీస్తోంది. అయితే.. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడే బలమైన గళం వినిపించాల్సిన చంద్రబాబు.. ఎక్కడో విఫలమవుతున్నారు. నిజానికి 2014-19 మధ్య టీడీపీ హయాంలోనూ కొన్ని పథకాలను ప్రవేశ పెట్టారు.
అవి కూడా పేదలతో ముడిపడ్డాయి. ఉదాహరణకు రంజాన్, క్రిస్మస్ కానుకలు, సంక్రాంతి కానుకలు.. పేదల ఇళ్లలో పండుగలు తెచ్చాయి. ఇక, అన్నా క్యాంటీన్ ఒక అద్భుత పథకమనే చెప్పాలి. మరి వీటిని క్లెయిమ్ చేసుకోవడంలో చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉంటున్నారనేది ప్రశ్న. ఇప్పటికైనా.. బలమైన గళం వినిపించకపోతే.. జగన్ నిజం.. అయిపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.