రాజకీయాల్లో ఏదైనా మాట్లాడొచ్చా.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఏదైనా అనేయొచ్చా.. అంటే.. ఎవ రైనా ఆచి తూచి మాట్లాడాలనే చెబుతారు. ఎవరైనా.. జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడాలని అంటారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తొందర పడుతుంటే.. వైసీపీ అధినేత జగన్ మాత్రం చాలా ఆచితూచి ఎక్కడ ఎంత వరకు ఏది అవసరమో.. దానినే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా.. కీలకమైన ఎన్నికల సమయం కావడంతో ఈ ఇద్దరి మధ్య చాలా తేడాలు కనిపిస్తున్నాయన్నది పరిశీలకుల మాట.
జగన్: ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో ఆయన బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సభలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ.. ఏది ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నారు. ఖచ్చి తంగా తూకం వేసినట్టు.. వ్యవహరిస్తున్నారు. దీంతో ఇమేజ్ చెక్కుచెదరకుండా కాపాడుకుంటున్నారు.
బాబు: ప్రజాగళం పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. ప్రసంగిస్తున్నారు కూడా. కానీ, మాటలు తూలుతున్నారు. అవసరం లేని విషయాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇమేజ్పై ప్రభావం పడుతోంది.
జగన్: విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఎక్కడా కౌంటర్ ఇవ్వడం లేదు. పైగా తాను కొత్త సమస్యలు తెరమీదికి తెస్తూ.. విపక్షాలకే సవాల్ గా మారుతున్నారు. ఉదాహరణకు తన పేరు చెబితే.. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు కనిపిస్తున్నాయని.. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎన్నేళ్ల తర్వాతైనా.. వీటిని తీసేయడం ఎవరికీ సాధ్యం కాదని అంటున్నారు.
బాబు: తన హయాంలో చేసిన పనులను చెప్పుకొనే ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యంగా పట్టిసీమను ప్రస్తావించి రైతుల్లో జోరు పెంచే అవకాశం ఉన్నా.. మరిచిపోయారు. ఇక, రాజధాని ఊసు కూడా ఎత్తడం లేదు. పైగా.. జగన్ చెబుతున్నవాటికి కౌంటర్లు ఇస్తున్నారు.
జగన్: తనపై చెల్లెలు షర్మిల చేస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు. ఎక్కడా షర్మిల పేరుకానీ.. సునీత పేరు కానీ.. ప్రస్తావించడంలేదు. వారి వ్యాఖ్యలకు కౌంటర్లు కూడా ఇవ్వడం లేదు.
బాబు: ఈ విషయంలోనూ తొందర పడుతున్నారు. సునీత తండ్రి చనిపోతే.. మేం అండగా నిలిచాం.. ఇప్పుడు ఆమె కాంగ్రెస్కు ఓటేయాలని అడుగుతోంది.. ఇది ద్రోహం కాదా? అని వెంటనే రియాక్ట్ అయిపోయారు. దీంతో అసలు మనం మద్దతు ఇవ్వడం ఎందుకు అనే ప్రశ్న టీడీపీలోనే వినిపించింది.
జగన్: మూడు పార్టీలు కలిసి వచ్చి.. తనపై పోరాడుతున్నాయంటూ.. ధైర్యంగా జగన్ చెబుతున్నారు. ఎక్కడా భయం అన్నమాటే కనిపించడం లేదు. వినిపించడం లేదు. పైగా.. మూడు పార్టీల లోపాలను ఎత్తి చూపుతున్నారు.
బాబు: మూడు పార్టీలు కలిసి ఉన్నా.. ఎక్కడో చింత కనిపిస్తోంది. మాటల్లో ఆదుర్దాతన్నుకు వస్తోంది. పైగా పింఛను రూ.4000 ఇస్తామన్న ఆయన ఏప్రిల్ నుంచే ఇస్తామని చెప్పడం కూడా.. నప్పడం లేదు.
జగన్.: బాబు పింఛనును రూ.4000 ఇస్తామన్నా.. జగన్ ఎక్కడా తొణకడం లేదు.. ఇంతకు మించి ఇస్తామన్న మాట కూడా రాలేదు. చాలా కాన్ఫిడెంట్గా ముందుకు సాగుతున్నారు.
కొసమెరుపు: ఇవన్నీ.. టీడీపీ అధినేతకు నచ్చకపోవచ్చు. కానీ, ఏ ఇద్దరు ఓటర్లు కలిసి కూర్చున్నా.. చెప్పుకొనే టాక్ ఇదే. మరి దీనిని బాబు గమనిస్తే.. వచ్చే 30 రోజుల్లో మార్పు కనిపిస్తుంది.