దళిత వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన మహాసేన రాజేష్ ఈ నెల 16న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా పెద్దాపురంలో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో రాజేష్ టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే మహాసేన రాజేష్ తొలుత జనసేన పార్టీలో చేరతారని భావించారు. అధికార వైసీపీకి వ్యతిరేకంగా, జనసేన, టీడీపీకి అనుకూలంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మహాసేన రాజేష్ గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మహాసేన రాజేష్ టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
మహాసేన రాజేష్ టీడీపీలో చేరడంపై పలువురు జనసేన శ్రేణులు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆయనను వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజేష్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పాలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహాసేన రాజేష్ గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని సూచించారు. అతను ఏ పార్టీలో చేరాలనుకున్నారనేది అతని ఇష్టమనీ, అది తన ప్రజాస్వామ్య హక్కు అని నాగబాబు స్పష్టం చేశారు. అతని నిర్ణయం ఎలాంటిదైనా గౌరవించాలన్నారు. అతనికి శుభాకాంక్షలు తెలపాలని నాగబాబు సూచించారు.
2019 ఎన్నికలకు ముందు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన మహాసేన రాజేష్.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన గుర్తింపు గౌరవం లభించకపోవడంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తన యూట్యూట్ ఛానల్ ద్వారా ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. గతంలో జనసేనకు అనుకూలంగా వ్యవహరిస్తూ కామెంట్స్ చేయడంతో ఆ పార్టీలో చేరతారని భావించారు. అయితే అక్కడి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమో లేక ఇతరరత్రా కారణాలు ఏమి ఉన్నాయో తెలియదు కానీ టీడీపీ చేరడానికి నిర్ణయాన్ని ప్రకటించారు. రీసెంట్ గా చంద్రబాబును కలిసి మాట్లాడినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
గవర్నర్ గా న్యాయకోవిదుడు నియామకంతో ఇక ఏపీ సీఎం జగన్ కు తలనొప్పులు తప్పవా..?