YS Jagan: ఒక నాటి ప్రముఖ సువార్తకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే ముందుగా అనుమతి తీసుకోకపోవడంతో కేఏ పాల్ ను కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో కొద్ది సేపు ఎదురుచూసిన కేఏ పాల్ అక్కడి నుండి వెనుతిరిగారు.
ప్రజా సమస్యలపై చర్చించి వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేద్దామని చెప్పేందుకు వచ్చానని అన్నారు కేఏ పాల్. మంగళ, బుధవారం విజయవాడలోనే ఉండి వేచి చూస్తానని చెప్పారు. ఎంతో మంది దేశాధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారని, రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్లుగా చెప్పుకొచ్చారు. తనను కలిసేందుకు అవకాశం ఇస్తే దీవిస్తానని అన్నారు. తనను తిరస్కరిస్తే భగవంతుడిని తిరస్కరించినట్లేనని వ్యాఖ్యానించారు.
తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ కూడా మాజీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు కేఏ పాల్. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తారో, 75 సీట్లు గెలుస్తారో, 25 సీట్లు గెలుస్తారో తనకు తెలియదన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తూ డిపాజిట్ కూడా దక్కించుకోని కేఏ పాల్ .. తరచు ప్రముఖుల పేర్లు చెబుతూ, హాస్యాస్పద కామెంట్స్ చేస్తూ పొలిటికల్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. సీఎం జగన్ ను ఇప్పటి వరకు కలవలేదని, ఇప్పుడు కలవడానికి వచ్చానని చెప్పుకున్నారు.
గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. అటు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా పలు మార్లు సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఇటువంటి కేఏ పాల్ కు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్..ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. నిత్యం పలు జిల్లాల ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో కేఏ పాల్ కు అవకాశం ఇస్తారో లేదో మరి.
YSRCP: రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు చేసిన వైసీపీ