బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో సారి పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. సోము వీర్రాజు తీరుపై కన్నా లక్ష్మీనారాయణ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ కోర్ కమిటీలో ఏమి జరుగుతుందో కమిటీ సభ్యులకే తెలియడం లేదనీ, అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇంతకు ముందు కన్నా లక్ష్మీనాారాయణ కామెంట్స్ చేశారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు నుండి విడిపోతే అందుకు సోమునే బాధ్యత వహించాల్సి వస్తుందంటూ కూడా వ్యాఖ్యానించారు. తాజాగా ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పు అంశంపైనా కన్నా లక్ష్మీనారాయణ ఇవేళ స్పందించారు.

బుధవారం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. కోర్ కమిటీలో చర్చించకుండానే పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుల మార్పును తనతో సంప్రదించలేదని చెప్పారు. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లేనని అన్నారు. కోర్ కమిటీ సమావేశం తప్ప పార్టీలో ఇతర ఏ విషయాలు తమకు తెలియడం లేదన్నారు. తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సమయంలో చాలా మందిని బీజేపీలోకి జాయిన్ చేశాననీ, ఇప్పుడు వాళ్లంతా ఎందుకు బయటకు వెళుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు. ఆయన వియ్యంకుడు బీఆర్ఎస్ లో ఎందుకు చేరారో సోము వీర్రాజును అడగాలని అన్నారు. ఎంపి జీవీఎల్ నర్శింహరావు ఆలోచన ఎప్పుడూ స్థానిక బీజేపీ నేతల అభిప్రాయాలకు భిన్నంగా ఉంటుందన్నారు. అమరావతి రాజధాని సహా అనేక అంశాల్లో జీవీఎల్ వైఖరి అందరూ చూశారని అన్నారు.
ఇదే క్రమంలో బీఆర్ఎస్ లో చేరికలపైనా మాట్లాడారు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ – కేసిఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ లోకి ఏపి నేతల చేరికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్,. తెలంగాణలో బండి సంజయ్ ను వీక్ చేసే కుట్రను కేసిఆర్ – జగన్ లు కలిసి చేస్తున్నారని ఆరోపించారు. ఒన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని అన్నారు. పవన్ కళ్యాణ్ కు తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కాపులపై మీడియా దుష్ప్రచారం చేస్తొందని కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
YSRCP Internal: రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు మళ్లీ ఖాయమే ..! కానీ..?