ఏపి లోని జగన్మోహనరెడ్డి సర్కార్ విద్యా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 – 24 విద్యా సంవత్సరం నుండి 1 నుండి 9వ తరగతి వరకూ రెండు సెమిస్టర్లు, పదో తరగతి కి సంబంధించి 2024 – 25 సంవత్సరం నుండి సెమిస్టర్ విధానం ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా నాడు – నేడు పేరుతో పాఠశాలలకు మౌళిక సదుపాయాలను కల్పించడం, ఇంగ్లీషు మీడియం విద్యావిధానం తీసుకురావడం, అమ్మఒడి పథకం కింద నిధులు ఇవ్వడం, 8వ తరగతి విద్యార్దులకు ల్యాప్ టాప్ లు అందించడం, బైజూస్ కంటెంట్ అందించేందుకు చర్యలు తీసుకోవడం లాంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సెమిస్టర్ విధానం తీసుకువస్తొంది.