Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు దాదాపు 300 రోజులకుపైగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నా కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ చేయడం ఖాయమంటూ ముందుకే వెళుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి బాసటగా నిలుస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఒక్క రోజు దీక్ష చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్న అధికార పార్టీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా వైసీపీ నుండి స్పంధన లభించలేదు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ప్లకార్డులతో నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రంపై వైసీపీ ఎంపీలు 22 మంది, టీడీపీ ఎంపీలు ముగ్గురు పోరాడేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించిన జనసేన డిజిటల్ ఉద్యమానికి పిలుపు ఇచ్చింది.
Pawan Kalyan: రాజకీయ పార్టీలు విభేదాలు పక్కన పెట్టి ముందుకు రావాలి
ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జనసేన డిజిటల్ ఉద్యమాన్ని చేపట్టనుందని చెప్పారు. ఈ నెల 18,19,20 తేదీల్లో ప్రజలు విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి, వైసీపీ, టీడీపీ ఎంపీలకు ట్యాగ్ చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇలా చేసి రాష్ట్ర ఎంపీలకు బాధ్యత గుర్తు చేద్దామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ అఖిలపక్షం ఏర్పాటు చేస్తే కలిసి పోరాటం చేయడానికి జనసేన సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు విభేదాలు పక్కన పెట్టి ముందుకు రావాలని కోరారు. జనసేనాని పిలుపుపై వైసీపీ, టీడీపీ ఎంపీలు స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.