Pawan Kalyan: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన విధ్వంసకర ఘటనలపై అధికార వైసీపీ దీనిలో రాజకీయ కుట్ర ఉందని టీడీపీ జనసేన పాత్ర ఉందంటూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భుధవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు.వైసీపీ ప్రభుత్వ ముందస్తు ప్రణాళికలో భాగంగానే అమలాపురంలో అల్లర్లు చెల రేగాయని పవన్ పేర్కొన్నారు. ఏపీలోని అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టిన ప్రభుత్వం కోనసీమకు మాత్రం మరో విధానం అనుసరించిందని విమర్శించారు. కొత్త జిల్లాలు ప్రకటించినప్పుడే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం చేయడంలో వైసీపీ ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాలకు జాతీయ స్థాయి నాయకుల పేర్లను పెట్టడం జనసేన సమర్థిస్తుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్.. ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ లాంటి వ్యక్తి పొట్టి శ్రీరాములను ఒక జిల్లాకు పరిమితం చేశారని అన్నారు. పేర్లు పెట్టేటప్పుడు కాస్త సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. కృష్ణా నది తక్కువగా ఉన్నచోట కృష్ణా జిల్లా పెట్టారు, కృష్ణా నది ఎక్కువగా ఉన్నచోట ఎన్టీఆర్ పేరు పెట్టారని అన్నారు. జిల్లా పేర్లకు వ్యతిరేకమైనా.. వ్యక్తులకు వ్యతిరేకం కాదన్నారు. కోనసీమ జిల్లా విషయంలో అభ్యంతరాలు ఉంటే 30 రోజులు సమయం ఇస్తున్నామని, వ్యక్తులుగా వచ్చి అభ్యంతరాలు ఇవ్వాలని చెప్పడంలోనే వైసీపీ దురుద్దేశం ఇట్టే అర్థమవుతోందని అన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా అని ప్రశ్నించారు. సామూహికంగా కాదు.. వ్యక్తులుగా రావాలని చెప్పారు .వ్యక్తులను టార్గెట్ చేయడమేనని జనసేన భావిస్తోందన్నారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా?, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలి? అని పవన్ ఫ్రశ్నించారు. దాడి జరుగుతుందంటే ఇంటికి రక్షణగా ఉండాలి కానీ ఆ ఘారాన్ని ఆపకుండా జరిగేలా చేస్తారా అన్నారు. పైపెచ్చు జనసేనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కుల సమీకరణపై రాజకీయాలు చేస్తారా? భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారు? అని ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు పవన్ కళ్యాణ్.
మూడు రోజుల క్రితం కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ను హత్య చేశాడనీ, అతని మృతదేహం తెచ్చి బాధితుడి ఇంటికి తెచ్చి పడేశారనీ, డ్రైవర్ ఎస్సీ వ్యక్తి కావడంతో వ్యతిరేకత వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. ప్రజల దృష్టి మరల్చేందుకే కోనసీమలో గొడవలు రేపారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు కోనసీమకే పేరు పెట్టడం వెనుక ప్రభుత్వ ఆలోచన ఏమిటని ప్రశ్నించారుయ కడప జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టవచ్చు కదా? అని అన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టేలా చూడాలని కోరుతున్నారు. మొదటి ఎస్సీ ముఖ్యమంత్రి పేరు పెట్టడం మంచిదని సూచించారు. తమ ప్రభుత్వం వచ్చినప్పుడు కర్నూలు జిల్లాకు ఆ పేరు పెడతామని హామీ ఇచ్చామన్నారుయ .అంబేడ్కర్ స్ఫూర్తిని అమలు చేయటం మాని వేసి ఈ పనులు చేస్తున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్. అంబేడ్కర్పై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సజావుగా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లలో రూ.10 వేల కోట్లు దారిమళ్లించారని అన్నారు. దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
ఎస్సీలకు ఇవ్వాల్సిన వాహనాలు కూడా ఇవ్వడం లేదని పవన్ అన్నారు. ఎస్సీలకు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వటం ఆపేశారని విమర్శించారు. అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనకు నిధులు ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ కుల రాజకీయాలకు ఆజ్యం పోసిందని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. కోడి కత్తి ఘటనపై విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు. వైఎస్ వివేకా హత్య విషయంలో వాస్తవాలు ఏమిటని ప్రశ్నించారు. కోడికత్తి కేసు సమయంలో ఏపీ పోలీసులను నమ్మేది లేదన్నారు. కులాల మధ్య ఘర్షణ రావణకాష్టం లాంటిదనీ, కులాల గొడవలు జరిగితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి వారి ఉచ్చులో పడవద్దని యువతకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు గొడవలు తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. సజ్జల వంటి పెద్దల అనుభవం కులాల మధ్య గొడవలకు కారణం కాకూడదని అన్నారు పవన్ కళ్యాణ్.