Sajjala Ramakrishna Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ ఇటీవల కోర్టుకు సమర్పించిన చార్జ్ షీటు వివరాలు బయటకు రావడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా కుమార్తె సీబీఐకి ఇచ్చిన వాంగ్మలంలో తన నివాసానికి వైఎస్ విజయమ్మ, భారతి, సజ్జల రామకృష్ణారెడ్డిలు వచ్చారనీ, ఏ స్టెప్ తీసుకున్నా సజ్జలకు చెప్పి చేయాలంటూ భారతి తనకు చెప్పారని సునీత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవేళ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సునీత చెబుతున్న వన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. భారతమ్మ, తాను కలిసి సునీత ఇంటికి వెళ్లలేదనీ, అవినాష్ రెడ్డిని డిఫెండ్ చేయమని తాను చెప్పలేదన్నారు. వివేకా పరువు కాపాడాలనే అవినాష్ కుటుంబం ప్రయత్నించిందని చెప్పారు.
సీబీఐ చార్జి షీట్ లో అన్ని కల్పిత కథలే అని కొట్టిపారేశారు సజ్జల. ముందే దోషులను నిర్ధారించుకుని కథలు అల్లారని తెలిపారు. ఎల్లో మీడియా, టీడీపీ మసాలాతో అవసరమైన సరుకుగా చార్జిషీట్ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా చార్జి షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు. బేసిక్ లాజిక్ ను సీబీఐ మర్చిపోయిందన్నారు. వ్యవస్థలో చంద్రబాబు వైరస్ లా పాకారని అన్నారు. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారనీ, వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగిందన్నారు. గూగుల్ టేక్ అవుట్ నిలబడదని వారికి అర్ధమైందని అందుకే నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారన్నారు. సునీత ఇప్పటి వరకూ ఆరు ఏడు స్టేట్ మెంట్లు ఇచ్చారని కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషయం చిమ్ముతున్నారన్నారు.
వివేకా పేరు మీద మచ్చట పడకూడదని అవినాష్ రెడ్డి, ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వచ్చారన్నారు. వివేకా హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి కోరుతున్నామన్నారు. ఏ స్టేట్ మెంట్ చూసినా ఒక వైపు మాత్రమే ఉన్నాయనీ, చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్ మెంట్లు మార్చారని అన్నారు. అవినాష్ రెడ్డి వైపు చూపేందుకు దస్తగిరిని అప్రూవర్ గా మార్చారని పేర్కొన్నారు. అధారాలన్నీ ఒక వైపు చూపిస్తుంటే దర్యాప్తు మరో వైపు సాగిందని ఆరోపించారు. సునీతకు వాళ్లు సలహాదారులుగా మారారని విమర్శించారు. అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారనీ, అవినాష్ రెడ్డి ఎంపిగా గెలవడం కోసం వివేకా పని చేశారని సజ్జల తెలిపారు.
సునీత ఇంటికి తన సతీమణితో ఒక సారి పరామర్శించడానికి వెళ్లానని తెలిపారు సజ్జల. సునీతకు ప్రెస్ మీట్ పెట్టమని కూడా తాను చెప్పలేదన్నారు. గూగుల్ టేక్ ఔట్ పేరుతో ముందు అవినాష్ తండ్రిని అరెస్టు చేశారనీ, ఇప్పుడు గూగుల్ టేక్ ఔట్ ఆధారం కాదని తేలిపోయిందన్నారు. జూన్ 19న అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారనీ, దాన్ని దృష్టిలో పెట్టుకుని సునీతతో మళ్లీ స్టేట్ మెంట్ ఇప్పించారని సజ్జల తెలిపారు. సీబీఐకి కోర్టు మొట్టికాయలు వేసినా వారి తీరు మారడం లేదని అన్నారు. వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఏ అస్త్రం లేక శక్తిలు ఉడిగిపోయిన గుంట నక్కలు ఇలా సీబీఐని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
రామచంద్రాపురం వైసీపీ టికెట్ పంచాయతీకి ఎండ్ కార్డ్ .. సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యమన్న బోస్