టీడీపీకి బద్ధ శత్రువులు ఎవరు? అంటే ఠక్కున వచ్చే సమాధానం సీఎం జగన్ అనే! కానీ, చంద్రబాబు కు ఈయనను మించిన శత్రువులు ఇద్దరు ఉన్నారు. వారే.. గుడివాడ ఎమ్మెల్యే కొడలి నాని, గన్నవరం ఎమ్మె ల్యే వల్లబనేని వంశీ. ఈ ఇద్దరినీ ఓడించాలనేది చంద్రబాబు లక్ష్యం. తనను వ్యక్తిగతంగా విమర్శించడం తోపాటు.. కుటుంబాన్ని సైతం రోడ్డున పడేశారన్న ఆవేదన ఈయనలో ఉంది. దీంతో వీరిని అడ్డుకోవడం లో తొలి ప్రాధాన్య వీరిద్దరినీ ఓడించడమే.
ఈ క్రమంలో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు ఆచి తూచి అడుగులు వేశారు. గన్నవరంలో వైసీపీ నాయకుడు, ప్రస్తుత టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావును పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చారు. ఇక్కడితో చంద్రబాబు పని అయిపోలేదు. ఇక్కడే అసలు స్టోరీ ఆయన ప్రారంభించారు. టీడీపీలో ఉన్న అందరినీ సమన్వయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కదలి వెళ్లి యార్లగడ్డకు మద్దతు పలికేలా.. నిరంతరం వారికి ఫోన్లు చేస్తున్నారు.
ప్రతి రోజూ చంద్రబాబు గన్నవరం నియోజకవర్గం నాయకులతో టచ్లో ఉంటున్నారు. యార్లగడ్డకు దిశా నిర్దేశం చేస్తూనే నేతలను ముందుండి నడిపిస్తున్నారు. ఇక, నారా భువనేశ్వరి.. శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు గన్నవరంలో పర్యటించి ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి తగిన ప్రణాళికలను కూడా పార్టీ సిద్ధం చేసింది. దీంతో గన్నవరంలో టీడీపీ సానుభూతి పరులు మొత్తం ఏకం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ యార్లగడ్డ గెలుపు కంటే.. వంశీ ఓటమికే చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
మరోవైపు గుడివాడలో మరింత ఊపు తెస్తున్నారు. టికెట్ ను ఎన్నారై నాయకుడు వెనిగండ్ల రాముకు ఇచ్చారు. దీంతో అసంతృప్తికి గురైన రావి వెంకటేశ్వరరావును చంద్రబాబు స్వయంగా బుజ్జగించారు. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. అంతేకాదు.. ఆర్థిక సమస్యలను కూడా తానే పరిష్కరిస్తానన్నారు. ఇక, అక్కడితోనూ చంద్రబాబు వదిలేయలేదు. పార్టీ పగ్గాలు దాదాపు రావికే అప్పగించారు. నిరంతరం ఆయనకు టచ్లో ఉన్నారు. తనతోపాటు భువనేశ్వరి కూడా.. ఇక్కడ ప్రచారం చేసేందుకు ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీంతో రెండు `జీ`లపై చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుండడం గమనార్హం.