TDP Mahanadu: ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో పార్టీ శ్రేణులకు బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. అయితే ఇదే క్రమంలో పలువురు సీనియర్ నేతలకు షాక్ తప్పదు అన్నట్లు సంకేతాలు వచ్చేశాయి. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యువతను ప్రోత్సహిస్తామని చెప్పడం, 40 శాతం యువతకే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చెప్పడంతో సీనియర్ నేతల ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీనికి తోడు వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ లను ఎన్నికల రంగం నుండి పక్కన పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ పరిణామం హ్యాట్రిక్ పరాజితులకు మింగుడు పడటం లేదు. మహానాడుకు అంచనాలకు అధిగమించి జనాలు రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అధికారంపై ఆశలు చిగురిస్తున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
TDP Mahanadu: మూడు సార్లు ఓటమి పాలైన నేతలకు షాక్
పార్టీ తీసుకున్న కీలక నిర్ణయంతో సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు లాంటి వారు పోటీ నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టీడీపీ ఆవిర్భావం నుండి ఆరు సార్లు (డబుల్ హ్యాట్రిక్) తుని నియోజకవర్గం నుండి గెలిచిన యనమల రామకృష్ణుడు తొలి సారిగా 2009 ఎన్నికల్లో పరాజయం పాలైయ్యారు. ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ వరుసగా మూడు సార్లు ఓడిపోయింది. అదే విధంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుండి 1994,99 ఎన్నికల్లో టీడీపీ తరపున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ తరువాత వరుసగా నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైయ్యారు. పార్టీ తీసుకున్న నిర్ణయంతో చంద్రమోహన్ రెడ్డికి పోటీ చేసే అవకాశం ఉండదు. కానీ ఆయనకే పోటీ చేయాలన్న ఉత్సాహం ఉంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కుమారుడిని రంగంలోకి దించే అవకాశం ఉంది.
పొత్తులతో మరి కొంత మందికి…
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు మూడు సార్లు ఓడిపోయిన వారు ఉన్నారు. ఈ నాయకులు ఓటమి పాలు అవుతున్నా సీనియారిటీ హోదాలో పార్టీలో చక్రం తిప్పుతూనే ఉన్నారు. ప్రధానంగా పొత్తుల అంశం కూడా పలువురు టీడీపీ సీనియర్ నేతలను కలవరపెడుతోంది. 2014 ఎన్నికల్లో జనసేన మద్దతు ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్ధులను పోటీకి నిలపలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేసింది. ఆ రెండు ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులు పోటీ చేశారు. అయితే ఈ సారి జనసేనతో పొత్తు ఖాయంగా కనబడుతోంది. పార్టీ నేతలు త్యాగాలకు సిద్దం కావాలని ఇప్పటికే చంద్రబాబు సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో సుమారు 30 నుండి 40 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతారు. పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశలో ఉన్న నేతలకు పోటీ చేసే అవకాశం రాదని సంకేతాలు అందుతుండటంతో వారికి షాకింగ్ గా ఉంది.