విజయవాడ తూర్పు నియోజకవర్గం.. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండే నియోజకవర్గం. పైన అమ్మవారు… కింద కమ్మవారు అని డీజే సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పినట్లుగానే విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఉండేది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇలాంటి నియోజకవర్గంలో ఈసారి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు… జూనియర్ నేతతో తలపడుతున్నాడు. టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్రావు పోటీ చేస్తుండగా… వైసీపీ తరఫున దేవినేని అవినాష్ పోటీ పడుతున్నాడు.
ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఈ ఇద్దరు గత ఎన్నికల సమయంలో టీడీపీలో ఉన్న వారే. 2019లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన అవినాష్.. ఆ తర్వాత అనూహ్యంగా వైసీపీలో చేరారు. చేరిన నాటి నుంచే విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఇక జగన్ కూడా తొలి నుంచి విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ అంటూ ప్రకటించారు. అందుకు తగినట్లుగానే అవినాష్ కూడా నిత్యం తూర్పు నియోజకవర్గం ప్రజలతోనే గడిపారు. అయితే ఈ నియోజకవర్గంలో సీనియర్ మోస్ట్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న గద్దె రామ్మోహన్ ముచ్చటగా మూడోసారి తూర్పు నుంచి పోటీ పడుతున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అవినాష్ సర్వశక్తులు ఒడ్డుతున్నాడనేది వాస్తవం. ఇంకా చెప్పాలంటే అవినాష్ గెలుపు కోసం స్వయంగా జగన్ కూడా రంగంలోకి దిగారు. ఎలాగైనా సరే అవినాష్ గెలివాలని ఇప్పటికే కిందిస్థాయి నేతలకు జగన్ ఆదేశించినట్లు సమాచారం. అయితే ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ను ఓడించటం అంత సులువు కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీనియర్ నేతగా ఉన్న రామ్మోహన్… సౌమ్యునిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ చిన్న సాయం కావాలన్నా సరే… లేదనకుండా చేస్తారనే పేరు రామ్మోహన్ సొంతం. లబ్బీపేట, పటమట వంటి క్లాస్ ఏరియాలతో పాటు… రాజరాజేశ్వరి పేట, కృష్ణలంక కాలనీ వంటి మాస్ కాలనీలు కూడా ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి.
లబ్బీపేటలో ఏ సమస్య అయినా.. అటు కృష్ణలంక వాసులకు ఏ ఇబ్బంది అయినా సరే.. గద్దె నేరుగా హాజరవుతారు. వీటన్నిటికీ తోడు వరదల నుంచి రక్షణగా కృష్ణా నది వెంట రిటైనింగ్ వాల్ నిర్మించటం గద్దెకు ప్లస్ పాయింట్. ఇదే సమయంలో టీడీపీ కార్పొరేటర్ చలసాని గోపిపై అవినాష్ వర్గం దాడి చేసింది. ఈ దాడిలో గోపి కన్ను పోయింది. విజయవాడలో చలసాని గోపికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే.. రాజకీయాల్లో ఆస్తులు పొగొట్టుకున్న నేత గోపి. అలాంటి గోపిపై దాడి చేయటం వల్ల కమ్మ సామాజికవర్గంతో పాటు పటమటలో ఆయన అభిమానులు కూడా అవినాష్పై ఆగ్రహంతో ఉన్నారు.
రాబోయే ఎన్నికల్లో గోపిపై దాడి ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇక వీటన్నిటికి తోడు… విజయవాడలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనేది వాస్తవం. సరైన రోడ్లు లేకపోవడంతో పాటు ఈ ఐదేళ్లల్లో డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయలేదు. ఉపాధి అవకాశం లేకపోవడంతో గతంలో ఈ ప్రాంతంలోనే ఉన్న పలు సంస్థలు మూతపడ్డాయి. ఇవన్నీ కూడా వైసీపీకి ఎదురుదెబ్బలే. మొత్తానికి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మరోసారి గద్దె రామ్మోహన్రావుకు ఎడ్జ్ ఉన్నా ఎన్నికల చివరి క్షణం వరకు ఏదైనా జరగొచ్చు..!