జగన్ కు చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయంతో పాటు అధికారికంగా కూడా ప్రత్యర్ధే. చంద్రబాబుని ఎలాగైనా సరే రాజకీయంగా ఎదగనియ్యకూడదు, సీఎం కుర్చీ మళ్ళీ ఎక్కనివ్వకూడదు అని జగన్ కంకణం కట్టుకున్నట్లే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాగైనా మళ్లీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్ట కూడదు అని జగన్ కంకణం కట్టుకున్నారు. దానికి ఎన్ని అడుగులు అయినా ముందుకు వేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. ఎన్నిసార్లైనా కోర్టు కు వెళ్తారు. ఎన్ని చట్టాలైనా మారుస్తారు. ఎంత దూరమైన వెళ్లేందుకు సీఎం జగన్ బృందం సిద్ధంగా ఉంది. అందుకు తాజా పరిణామాలే నిదర్శనం. ఇది వరకే హైకోర్టు..ఏపి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా, ఇదే విషయం మీద సుప్రీం కోర్టుకు వెళితే అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలినా, గవర్నర్ ను కలిసి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని హైకోర్టు ఆదేశించినా, ఈ రోజు రమేష్ కుమార్ వెళ్లి గవర్నర్ ను కలిసినా, ఇలా తెర ముందు, తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నా, ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం తమ ఫందాను, తమ పట్టును వీడటం లేదు. తాజాగా ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టడంపై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అందుకే నిమ్మగడ్డ విషయం ఇప్పట్లో తేలేది కాదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పట్లో వదిలేవాడు కాదు.
కోర్టులో పిటిషన్ వేస్తే పోయేదేముంది. ఓడినా, గెలిచినా కాస్త సమయం తీసుకుంటుంది. అవసరమైతే మరో వాయిదా వేయవచ్చు. అవసరమైతే ఇంకా వాయిదాలు పొడిగించవచ్చు. తీర్పు వచ్చిన తర్వాత కూడా దాన్ని సమీక్ష కోసమని మరో పిటిషన్ వేయవచ్చు. ఇలా సమయాన్ని, కాలాన్ని వృధా చేయవచ్చు. తద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎక్కడో ఒక చోట పురిస్టాప్ పెట్టొచ్చు. చంద్రబాబును ఎదో రకంగా ఎదుర్కోవచ్చు. ఇదే ప్రస్తుతం ఏపి ప్రభుత్వ యోచన. ప్రభుత్వం దగ్గర సరైన అస్త్రాలు, సరైన పాయింట్లు దొరికే వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మరో దారిలో ఇరుకున పెట్టే పాయింట్ దొరికే వరకు కోర్టుల ద్వారా కాలక్షేపం చేయడమే ప్రస్తుతం చేస్తున్న పని. అందుకే తాజా పిటిషన్ వెనుక అంతరార్థం అదే. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ ఈసీగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమయ్యారు. ఆయనకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈరోజు వెళ్లి గవర్నర్ ను కలిసి, గవర్నర్ అనుమతి ఇస్తే వెంటనే ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించి తన హవా చూపించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టింది. దీనిపై మరో వారమో, రెండు వారాల్లో, నెల రోజుల్లో తీర్పు వస్తే వస్తుంది లేకపోతే కాలం వృధా అవుతుంది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎస్ఈసీగా రారు. తాత్కాలికంగా కావాల్సింది అదే. సో.. ఈ విషయం ఇప్పట్లో తేలేది కాదు. జగన్ ఇప్పట్లో వదిలే వాళ్ళు కాదు.
జగన్ వెనుక ఎవరు ఉన్నారు? ఏపి ప్రభుత్వం వెనుక ఎవరు ఉన్నారు? ఇవన్నీ చేయిస్తున్నది ఎవరు? అనే అనుమానాలు రావచ్చు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యం నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రమే. రాజకీయంగా చంద్రబాబు లాగానే అధికారికంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్డుకోవాలంటే జగన్ కు న్యాయసలహాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ న్యాయసలహాలు కోర్టు లో నిలబడినా, నిలబడకపోయినా సమయం వృధా చేయడానికి మాత్రం బాగానే పనికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ తాజా అడుగుల వెనుక మాజీ సీఎస్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రమాకాంత్ రెడ్డి, ఆయనతో పాటు చెన్నైకి చెందిన, ఇది వరకు ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన కానగరాజ్ ఇటువంటి వాళ్లు అందరూ చట్టాలు తెలిసి, కోర్టు సూత్రాల్లో కొమ్ములు తిరిగిన వాళ్ళు జగన్ కి సలహాలు ఇస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా సలహాదారులు, న్యాయనిపుణులు ఎంత మంది ఉన్నా జగన్ ఉద్దేశం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డుకోవడం. ఆ ఒక్కటి నెరవేరుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్దేశం ఎస్ఈసిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టడం. అది జరగడం లేదు. సో..రాజకీయం ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని కోర్టులు, ఎన్ని వాయిదాలు గడచినా ప్రస్తుతానికి జగనే విజేతగా నిలుస్తున్నారు.