మంచి చేయాలనుకుంటే దానికి వయసుతో సంబంధం లేదు అనేది కొందరిని చూస్తే అర్ధమవుతుంది. భారతీయ పర్యావరణవేత్తలు ఎందరో అందులో వందేళ్లు దాటినా ఈ సాలూమారద తిమ్మక్క ఎంతో ప్రత్యేకం. ఏ విద్యను చదవని బామ్మకు ఈ సంవత్సరం కర్ణాటక సెంట్రల్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ అందజేసింది. సాధారణ కూలీగా పనిచేసిన ఈమెను బీబీసీ (బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్) ప్రపంచంలోని 100 అత్యంత ప్రభావవంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన మహిళలలో ఒకటిగా పేర్కొన్నదంటే ఈమె ఎంత శక్తివంతమైనదో అర్ధం చేసుకోవచ్చు.
మైసూర్ ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెలో పుట్టిన తిమ్మక్క ఆమె గ్రామానికి సమీపంలో మర్రి చెట్లు పుష్కలంగా ఉండేవి. ఆమె రోజు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామమైన కుదూర్ సమీపంలో కూలి పనులకు వెళ్లేది. ఆ సమయంలో రోడ్ల వెంబడి చెట్లు లేక కూలి చాల ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే తిమ్మక్కా ఆమె భర్త మొదట పది మొక్కలు అంటు వేసి, ఒక సంవత్సరం తరువాత 15 మొక్కలు, అలా సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వచ్చారు. ఈ దంపతులు మొక్కల పెరుగుదలకు నాలుగు కిలోమీటర్ల దూరం నుండి నీటిని తీసుకెళ్లేవారు. నాటిన మొక్కలను పశువులను మేయకుండా కంచెలు వేసి రక్షించారు. ఇలా ఏకంగా 385 మొక్కలతో పాటు దాదాపు 8వేల వివిధ రకాల మొక్కలను నాటింది. 80 ఏళ్ళ వయసులో భర్త చిక్కయ్య మరణించిన ఈమె మాత్రం పర్యావరణ రక్షణ చర్యలు మానలేదు.
2019 లో బాగేపల్లి-హలగురు రహదారి వెడల్పు కోసం ఈమె నాటిన చెట్లను తొలగించే పరిస్థితి ఏర్పడింది. దీనిపై వెంటనే స్పందించిన తిమ్మక్క ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరలను ఆ చెట్లు తొలగించకుండా విస్తరణ పనులు చేపట్టాలని అభ్యర్థించింది. వారు 70 సంవత్సరాల పురాతన చెట్లను కాపాడటానికి ప్రత్యామ్నాయాలను చూడాలని నిర్ణయం తీసుకున్నారు. వేల మొక్కలు నాటిన ఈ శాతాధికా బామ్మ ఇప్పటికి కూడా వర్షపు నీరు ఒడిసిపట్టేందుకు ట్యాంకుల నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేస్తుంది. ఈమద్యే ఒక సర్జరీ చేపించుకొని మళ్ళీ పర్యావరణ సేవ కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఈమె పనితీరును కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి నేషనల్ సిటిజన్, అవార్డుతోపాటు గత ఏడాది పద్మ శ్రీ అవార్డును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, పలు విద్యాసంస్థల నుండి కూడా చాల అవార్డులను స్వీకరించింది ఈ పర్యావరణవేత్త.