కంటికి కనిపించని కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని ప్రజలందరినీ బయట అడుగు పెట్టనీయకుండా భయబ్రాంతులకు గురి చేస్తోంది. మొదట్లో ఈ పరిస్థితి కొద్ది రోజులే అనుకున్నారు కానీ రోజులు కాస్తా వారాలు అయ్యాయి. ఇప్పుడు నెలలు నిండుతున్నాయి. ఈ సమయంలో ఒక్కసారిగా ఇళ్ళలో లాక్ అయిపోయిన చాలామందికి విపరీతంగా బోర్ కొడుతోంది. గతంలో స్కూల్ కి సెలవలు ఇస్తే ఆనందంగా ఇంట్లో గడిపేవారు మరియు ఆఫీస్ లో కొద్దిగా వెసులుబాటు దొరికితే లీవ్ పెట్టుకొని సొంత గ్రామానికి వచ్చే వారు కూడా ఇప్పుడు ఇంటి దగ్గర జీవితాన్ని జైలులా భావిస్తున్నారు. సరే అలా బయటకు వెళ్లి వద్దాం అనుకున్నా కూడా వెళ్లలేని పరిస్థితి దీంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
అటువంటి వారి కోసమే న్యూజిలాండ్ ప్రభుత్వం సోషల్ బబుల్ మరియు ట్రావెల్ బబూల్ అంటూ రెండు కొత్త కాన్సెప్ట్లను తీసుకొచ్చింది. ఈ విధానం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు ఎక్కువ మందిని కలవకుండా నియంత్రించే విధానం. తాము ఎంపిక చేసుకున్న కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను కలిసేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతిని ఇస్తాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే బయట వారితో కాంటాక్ట్ ఉంటుంది. దీని వల్ల మనస్సుకు కొద్దిగా ప్రశాంతత దొరకడమే కాకుండా ఆ గ్రూపులో ఎవరైనా పాజిటివ్ అని తేలితే మిగిలిన వారిని కూడా గుర్తించడం కూడా తేలిక అవుతుంది.
లాక్ డౌన్ అనంతరం ఈ విధానాన్ని న్యూజిలాండ్ దేశం అమలు చేస్తే ఇప్పుడు బెల్జియం, జర్మనీ దేశాలు కూడా దీనిని పాటిస్తున్నాయి. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మరియు డెన్మార్క్ లలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొన్నిచోట్ల పది మంది మాత్రమే కలుసుకునేందుకు అనుమతిస్తుండగా కొన్ని చోట్ల కేవలం కుటుంబ సభ్యులు వరకే పర్మిషన్ దొరుకుతుంది. అయితే ఈ కాన్సెప్ట్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది.
జర్మనీలో రెండు కుటుంబాల్ని మాత్రమే కలుసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎలాంటి వారిని ఎంపిక చేసుకోవాలన్న అంశంపై స్వేచ్ఛ ఉంటుంది. కాకుంటే.. అలా బబుల్ గా మారిన వారు మాత్రం తమను తాము క్షేమంగా ఉంచుకోవటంతో పాటు.. సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. బెల్జియంలో కూడా రెండు కుటుంబాల్ని కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. సోషల్ బబుల్ ఎలానో.. ట్రావెల్ బబుల్ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కొద్ది మంది కలిసి ప్రయాణిస్తారు.