YSRCP: సీఎంగా స్థాయిలో ఉన్న నాయకుడు తీసుకునే నిర్ణయాలు తనకు ఉపయోగపడాలి… తనకు, తన పార్టీకి, పనిలో పనిగా ప్రజలకు కూడా ఉపయోగడాలి… అప్పుడు ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా పాలన ఉంటుంది.. సీఎంగా తీసుకునే ప్రతీ నిర్ణయం వారి రాజకీయ భవిష్యత్తుకూ.., వాళ్ల పార్టీ బలోపేతానికి ఉపయోగపడాలి. అలానే అవి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి… కానీ ఆవేశంలో, ఆనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు పార్టీ భవిష్యత్తును గందరగోళంలో పడేస్తాయి. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఏపిలో ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం.. శాసనమండలి రద్దు నిర్ణయాలు అటువంటివే అని చెప్పవచ్చు. ఒక్క అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తుపై కొంచెం బెంగ అలముకుంది. సీఎం జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదించి రెండేళ్లు అవుతోంది. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. మూడు రాజధానులు వస్తాయని ఎంతో మంది (వైసీపీ అనుకూల వర్గాలు) ఆశతో ఉన్నారు. కృష్ణా, గుంటూరు ప్రాంతాలకు చెందిన వైసీపీ వాళ్లు కూడా మూడు రాజధానులకు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే వాళ్లకు పార్టీ ముఖ్యం కాబట్టి. నెలలు గడిచిపోయాయి కానీ మూడు రాజధానులు రాలేదు. వాటి ఫలితాలు అందలేదు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఆగిపోయింది. ఈ రెండేళ్లలో అమరావతిలో ఒక్క నయాపైసా పని కూడా జరగలేదు. అటు విశాఖ, కర్నూలులో ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. ఒక్క భారీ పరిశ్రమను మూడు ప్రాంతాల్లో ఎక్కడా నెలకొల్పలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ లేదు, పాలనా వికేంద్రీకరణ లేదు. తొందరపాటు నిర్ణయం మూలంగా రెండేళ్ల సమయం వృధాగా గడచిపోయింది. 2019 నవంబర్, డిసెంబర్ లో ఏవైతే బిల్లులను ఆమోదించారో ఇప్పుడు 2021 నవంబర్ నెలలో ఆవే బిల్లులను వెనక్కు తీసుకున్నారు. చట్టబద్దత లేదు, అందుకే వెనక్కు తీసుకున్నాము అని కారణం చెబుతున్నారు. మళ్లీ మార్పులు చేసి చట్టబద్దంగా, న్యాయబద్దంగా ఆమోదం పొందేలా మరో బిల్లు తీసుకువస్తామని చెబుతున్నారు. అది ఎప్పుడు తీసుకువస్తారో తెలియదు. ఇప్పుడు రెండేళ్లు వేస్ట్ అయినట్లే. కొత్తగా బిల్లు తీసుకువచ్చినా ఆ బిల్లులోనూ ఏదో ఒక చిన్న లోపం అంటే న్యాయపరమైన చిక్కు (లీగల్ లిటిగేషన్) లేకుండా ఉంటుందా అంటే ఉండదు అని ఖచ్చితంగా చెప్పలేము.
YSRCP: సలహాలేమి ఇవ్వట్లేదా..!?
జగన్మోహనరెడ్డి సర్కార్ తీసుకున్న ఈ అనాలోచన నిర్ణయానికి కారకులు ఎవరు. సలహాదారులు ఏమి చేస్తున్నారు. అనే విషయాలను గమనిస్తే.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారులు 35 మంది ఉన్నారు. వాళ్ల అందరికీ కలిపి నెలకు రూ. కోటిన్నర వరకు జీతం రూపంలో వెచ్చిస్తుంది ప్రభుత్వం. ఈ రెండున్నర సంవత్సరాల్లో సుమారు వారి వేతనాలు ఇతర అలవెన్స్ ల కింద సుమారు రూ. 45 కోట్ల వరకూ ప్రభుత్వ నిధులు వెచ్చించి ఉంటారు. అజయ్ కళ్ళం, సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడి కృష్ణమోహన్, తలశిల రఘురామ్, ఎన్ చంద్రశేఖరరెడ్డి ఇలా మొత్తం సలహాదారులు 35 మంది ఉన్నారు. ఇంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఈ రెండున్నరేళ్లలో ఎన్నో తప్పులు జరిగాయి. ముఖ్యంగా న్యాయపరంగా కొద్దో, గొప్పో తప్పులు జరుగుతూనే ఉన్నాయి.
* మూడు రాజధానుల బిల్లు, చట్టబద్దంగా లేదని వెనక్కు తీసుకున్నారు… * శాసనమండలి రద్దు.. ఓపిక పట్టలేకపోయారు. 2020 ఫిబ్రవరిలో శాసనమండలి రద్దుకు తీర్మానం ఆమోదించారు. ఆనాడు అనవసర ఖర్చు (దుబారా), రాజకీయానికి వేదిక అని ఆరోపిస్తూ మండలి అవసరం లేదన్నారు. ఇప్పుడు 2021 నవంబర్ ఇప్పుడు మండలి కావాలి అంటున్నారు. ఇప్పుడు ఇది అనవసర ఖర్చు దుబారా కాదా. ఇప్పుడు రాజకీయానికి వేదిక కాదా. అప్పుడు అవసరం లేని శాసనమండలి ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది. ఈ విషయంలో యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏమిటంటే అప్పుడు శాసనమండలిలో వైసీపీకి బలం లేదు. ఇప్పుడు మండలిలో వైసీపీకి బలం చేకూరింది. మెజార్టీ సభ్యులు ఉన్నారు. * ఈ రెంటి విషయాలతో పాటు వ్యవసాయ బిల్లు విషయంలోనూ ప్రభుత్వం తప్పటడుగు వేసింది. 2020 సెప్టెంబర్ నెలలో నూతన సాగు చట్టాలను రాజ్యసభలో ఆమోదించారు. ఆనాడు నూతన సాగు చట్టాలను ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన అకాళీదళ్ పార్లమెంట్ సభ్యురాలు మంత్రి పదవికే రాజీనామా చేసి ఎన్టీఏ నుండి వైతొలగిపోయారు కానీ వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆ బిల్లుపై చర్చలో మోడీని దేవుడుగా ప్రశంసిస్తూ మాట్లాడారు. ఈ బిల్లు అమోఘం అంటూ కొనియాడారు. మళ్లీ 2021 సెప్టెంబర్ నెలలో కేంద్రం ఆమోదించిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త బంద్ జరిగితే ఆ బంద్ కు వైసీపీ మద్దతు ఇచ్చింది. ఈ ద్వంద వైఖరికి దేనికి తార్కాణం. ఇంత మంది సలహదారులు ఉండి కూడా ఈ విధమైన తప్పులు ఎందుకు జరుగుతున్నాయి అనేదే సామాన్య ప్రజానీకాన్ని వేధిస్తున్న ప్రశ్న…!