ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజు రోజుకీ సీరియస్ అవుతున్న నేపథ్యంలో వైసీపీలో మరొక ఎంపీ అదే బాటలో నడుస్తున్న ఆనవాళ్ళు కనబడుతున్నాయి. సీఎం జగన్ ఆశీస్సులతోనే పార్టీ లోకి వచ్చాను అని చెప్పుకునే ఈయన ఈ మధ్య కాలంగా పార్టీపై మరియు వారి విధి విధానాలపై విమర్శలు సంధిస్తున్నారు. అయితే రఘురామకృష్ణంరాజు రేంజ్ లో లేకపోయినా మీడియా వారు పెద్దగా ఫోకస్ చేయలేదు కాబట్టి సరిపోయింది. కానీ పార్టీ అధినేత జగన్ మాత్రం వెంటనే అలెర్ట్ అయిపోయి.. ఆయన వైఖరిపై నివేదిక ఇవ్వాలని అడిగారట. ఇప్పుడు ఇదంతా మాట్లాడింది చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం నుండి గత ఏడాది వైసీపీ తరఫున పోటీ చేసిన బల్లి దుర్గాప్రసాద్ రావు గురించి.
మొదట టిడిపి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దుర్గాప్రసాద్… అతి పిన్న వయసులో ఎమ్మెల్యే అయి పార్టీలోనే బలమైన నాయకుడిగా ఎదిగాడు. గూడూరు రిజర్వుడు నియోజకవర్గం నుండి 1985, 1994, 1999, 2009 టిడిపి టికెట్ పై విజయం సాధించారు. 28 ఏళ్ళకే ఎమ్మెల్యే అయిన ఈయనకు చంద్రబాబు అనూహ్యంగా 2014 ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. అదీ 2009లో పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా. దీంతో వెంటనే ఆయన ఎటువంటి ఆలోచనలు లేకుండా వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.
ఈ క్రమంలో లో స్థానికంగా తనకు ఉన్న బలం మరియు జగన్ తుఫాను దెబ్బకు తిరుపతి ఎంపీగా అవలీలగా విజయం సాధించారు. ఇంత వరకు బాగానే ఉన్నా కాలం గడిచే కొద్దీ ఆయన స్థానిక నేతలు పట్టించుకోవడం మానేశారు అన్న విమర్శలు వచ్చాయి. ఇదే విషయమై కొన్ని సందర్భాల్లో దుర్గారావు వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు దుర్గా ప్రసాద్ రావు తనను ఎవరూ పట్టించుకోవడం లేదని మరియు ప్రోటోకాల్ ప్రకారం కూడా తనకి దక్కాల్సిన గౌరవం కూడా దక్కడం లేదని ఆరోపించడం గమనార్హం.
ఇక తిరుపతి నగరంలో నిర్మిస్తున్న గరుడ వారధి నిర్మాణం కేంద్రం ఇచ్చే స్మార్ట్ సిటీ నిధులతోనే జరుగుతోందని, రాష్ట్రం రూపాయి కూడా ఇవ్వడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద మైనస్గా మారాయి. అంతేకాదు.. కరోనా విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలు తనకు నచ్చలేదని కూడా బల్లి దుర్గాప్రసాదరావు విమర్శలు గుప్పించారు. ఇవన్నీ జరిగి నాలుగు రోజులు గడిచాయి.
అయితే, ఈ విషయంలో పార్టీ నేతలు ఉన్నారన్న ఆయన ఆరోపణలు సహా తాజాగా నరసాపురం ఎంపీ వివాదం నేపథ్యంలో జగన్ బల్లి దుర్గా ప్రసాద్రావు వ్యవహారంపై కూడా దృష్టి పెట్టారని, అసలు అక్కడ ఏం జరుగుతోందో తనకు చెప్పాలని ఇంచార్జ్ మంత్రిని ఆదేశించినట్టు సమాచారం. మరి ఈయన రాజుగారిలా పరిస్థితిని క్లిష్టతరం చేసుకుంటారా లేక అధిష్టానంతో రాజీపడి మెలుగుతారా అన్నది చూడాలి.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!