ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఎల్లవేళలా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్న విఐపిలు సైతం ఈ మాయదారి మహమ్మారి బారిన పడుతున్నారు అంటే అది ఎంత ప్రమాదకరమైనదో అర్ధం చేసుకోవచ్చు. నిన్నటికి నిన్న ఇంగ్లాండ్ కు బయలుదేరవలసిన పాకిస్తాన్ క్రికెట్ టీం లో పది మంది కీలక ఆటగాళ్ళు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే టాప్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కు కరోనా పాజిటివ్ అని తేలడం పెద్ద సంచలనంగా మారింది.
ప్రజల కోసం రిస్క్ చేశాడు….
అందరూ…. “తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా ఉన్నాడు?” అని జకోవిచ్ ను తిట్టిపోయవచ్చు. అయితే అసలు అతనికి కరోనా ఏ విధంగా సోకిందన్న విషయం గురించి చాలా కొద్దిమందికే తెలుసు. సెర్బియా క్రొయేషియాల్లో జరిగిన చారిటీ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో జకోవిచ్ పాల్గొన్నాడు. ముందుగా బెల్గ్రేడ్ లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఆడిన అనంతరం క్రొయేషియా లోని గత వారాంతం జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ లో కూడా నొవాక్ ఆడాడు. అయితే మ్యాచ్ ముగించుకొని బెల్గ్రేడ్ కు రాగానే కుటుంబ సభ్యులతో కరోనా టెస్టులు చేయించుకున్న జకోవిచ్ మరియు అతని భార్య జెలీనా కు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే అతని పిల్లలు మాత్రం వైరస్ నుండి సేఫ్ కాగా… ఆ మ్యాచ్ లో భౌతిక దూరం నిబంధన సరిగ్గా అమలు కాకపోవడం వల్లే జకోవిచ్ కు కరోనా వచ్చిందని అర్థం అవుతోంది.
మంచి కోసం అయినా తప్పు తప్పే అని ఒప్పుకున్నాడు…
ఇదిలా ఉంటే గత నెలలో తాము తలపెట్టిన కార్యక్రమం ఒక మంచి పనికోసం పవిత్ర హృదయంతో చేశామని జొకోవిచ్ చెప్పాడు. కరోనాతో చాలా మంది బాధపడుతున్న సమయంలో ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా వారందరికి సంఘీభావం చాటాలని అనుకున్నట్లు జొకోవిచ్ చెప్పాడు. అయితే ఈ వైరస్ ఇంకా వీడకపోవడం దురదృష్టకరమన్నాడు. అయితే ఈ వైరస్తో కలిసే జీవించాలన్నది నగ్న సత్యం అని జొకోవిచ్ చెప్పాడు. ఇదిలా ఉంటే హోంక్వారంటైన్లో 14 రోజుల పాటు ఉంటానని వివరించిన జొకోవిచ్… ఈ సిరీస్ ద్వారా ఇతరులు ఎవరైనా ఇన్ఫెక్షన్కు గురై ఉంటే క్షమించాల్సిందిగా కోరాడు.
మన దగ్గర అజాగ్రత్త… ఉదాసీనత తప్ప ఏం కనపడవు..!
కరోనా ప్రబలిన మొదట్లో భారతదేశంలో తబ్లిజి జమాత్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందిరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో దాదాపు దేశంలో నమోదయిన 75 శాతం కేసులు తబ్లిజి ప్రార్థనకు లింక్ అయి ఉండటం గమనార్హం. అసలు ప్రభుత్వం ఆ ప్రార్థను కు కరోనా ప్రబలుతున్న సమయంలో ఎలా అనుమతి ఇచ్చింది అని పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దానినీ పక్కనపెడితే లాక్ డౌన్ సమయంలో కూడా కేవలం రాజకీయ నాయకుల దగ్గర నుండే పార్టీ ర్యాలీలు, బర్త్డే పార్టీలు, ప్రజలతో రోడ్డుమీద పూలపాన్పు వేయించుకోవడం వంటివి ఎన్నో జరిగాయి. తాజాగా పూరి రథయాత్ర కూడా ఇదే కోవలోనికి వస్తుంది. అంతెందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అజాగ్రత్త వల్ల ఆర్టీసీ సిబ్బంది లోనే 20 మందికి నేడు కరోనా పాజిటివ్ అని బయటపడటం గమనార్హం.
చిత్తశుద్ధి ఎక్కడ?
కేంద్ర ప్రభుత్వం మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సార్లు కరోనా ను అరికట్టడంలో విఫలం కావడంతో పాటు అనేకానేక నిర్ణయాలతో మరియు అజాగ్రత్తతో వైరస్ వ్యాప్తికి కారణం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎవరూ ఒక్కసారి కూడా వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం. ప్రజలు అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఇష్టారాజ్యంగా తిరుగుతుంటే వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు దేనికి కావాలంటే దానికి అనుమతులు ఇచ్చేయడం… క్వారంటైన్ లో సరిగ్గా సదుపాయాలు కల్పించకపోవడం మరియు ఏకంగా బాలికల ప్రభుత్వ హాస్టల్ లోనే కరోనా పాజిటివ్ కేసులు బయటపడడం వంటివి ఎన్నో చూస్తూనే ఉన్నాం. మరి మంచి కోసం ప్రయత్నించిన జకోవిచ్ కరోనా బారిన పడి క్షమాపణలు చెప్పగా… తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిరోజూ ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెట్టేస్తున్న మన వాళ్ళు ఎన్ని సార్లు క్షమాపణ చెప్పాలి?
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!