`అఖండ` వంటి సూపర్ హిట్ మూవీ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో, 108వ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ప్రకటించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని సినిమా ప్రస్తుతం సెట్స్ మీదే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం లో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అనిల్ రావిపూడి సినిమా విషయానికి వస్తే ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య సాగుతుంది.
ఇందులో బాలయ్య వయసు పైబడిన తండ్రిగా మున్నెప్పుడూ కనిపించని లుక్లో అలరించబోతున్నారు. అలాగే ఆయన కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీలా కనిపించబోతోంది. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా తేలలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అయిందట. ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, గతంలో బాలయ్య-నయనతార జంటగా సింహ, జై సింహా వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని వార్తలు వస్తుండడంతో.. ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.