`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు.
సగానికి పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదన్నది లేటెస్ట్ టాక్. అయితే బాలయ్య వెనక్కి తగ్గడంతో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండక్కి థియేటర్లో సందడి చేసేందుకు వచ్చేస్తున్నాడట.
ప్రస్తుతం ఈయన చేస్తున్న ప్రాజెక్స్ట్లో `మెగా 154` ఒకటి. ఇందులోనూ శృతి హాసన్నే హీరోయిన్ కాగా.. మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దాదాపు అరవై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను సంక్రాంతి బరిలో దింపాలని సన్నాహాలు చేస్తున్నారట.
ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. కానీ, బాలయ్య సినిమా కూడా వస్తుందని ప్రచారం జరగడంతో.. చిరు సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనే నిర్మిస్తుంది. రెండు చిత్రాలు పోటీ పడితే సంస్థకే నష్టం. అందుకే ఒక సినిమాను సంక్రాంతికి మరొక సినిమాను మరో తేదీకి విడుదల చేసేలా హీరోలను ఒప్పించారట. ఈ నేపథ్యంలోనే బాలయ్య వెనక్కి తగ్గడంతో.. చిరంజీవి సంక్రాంతికి వస్తున్నాడట. ఇక ఈ న్యూస్తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.