ఆహరం లో ఎన్ని వేసినాకూడా ఉప్పు వేయకుండా పూర్తి అవ్వదు …రుచికూడా రాదు. దాన్ని మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం. లేకపోతే అనారోగ్యమే. 40శాతం సోడియం, 60శాతం క్లోరిన్ ఉండే ఉప్పు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు సమర్ధంగా పనిచేసేట్టు చేస్తుంది.
రక్తప్రసరణ సాఫీగా సాగేట్టు చూడటమే కాకుండా కండరాలు ఉత్సాహంగా పనిచేసేలా ఉంచుతుంది. అంతేకాదు శరీరంలో అవసరమైన నీటిశాతాన్ని ఉంచేలా చూసుకుంటుంది. చిన్న పేగులకు కావాల్సిన ఆహారాన్ని సరఫరా చేయడంలో ఉప్పుదే కీలక పాత్ర.మరి అంతటి ప్రాధాన్యత కలిగిన ఉప్పు తగు మోదాలులో తీసుకోకపోతే సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరీముఖ్యంగా చిన్నారుల ఆహారంలో ఉప్పును మోతాదులో వాడకపోతే వారికి అనారోగ్యాన్ని కొనితెచ్చినవాళ్లం అవుతామని చెబుతున్నారు.
1-3 సంవత్సరాల లోపు చిన్నారులకు రోజూ తీసుకునే ఆహారంలో 2 గ్రాములు, 4-6 వయసులో ఉన్న చిన్నారులకు 3గ్రామలు, 7-10 వయసున్న పిల్లలకు 5 గ్రాములు, 11 సంవత్సరాలు ఆపైన వయసున్న పిల్లలకు 6గ్రామలు ఉప్పు ఉండేలా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వీధుల్లో దొరికే ఆహారం, జంక్ ఫుడ్, పాపాడ్, నిల్వ ఉంచిన పచ్చళ్ళు , బ్రెడ్, బేకరీ తినుబండారాలతో పాటు మైదా ఉత్పత్తుల నుంచి తయారు చేసే నూడుల్స్, పాస్తా వంటి ఆహార పదార్థాల్లో ఉప్పు అధికంగా ఉంటుందని వైద్యులు హైచ్చరిస్తున్నారు. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ఆహారంలో ఉప్పుశాతం మోతాదుకు మించి తీసుకుంటే దీర్ఘకాలంలో పిల్లలకు హైపర్ టెన్షన్, తరచూ తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, బుద్ధి మందగించడం, హర్మోన్ల సమన్వయలోపంతో పాటు మరికొన్ని సార్లు డయాబెటిస్ కు సైతం దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు, స్థూలకాయం, కిడ్నీల్లో రాళ్ల ఏర్పడటం, శరీరంలో నీటిశాతం ఎక్కువ గా ఉండడం వంటి సమస్యలు తప్పవని…అందుకే ఉప్పు వాడకంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అధిక ఉప్పు చిన్నారులకే కాదు పెద్దలకూ ముప్పే.ఎందుకంటే తాజాగా ముక్కుపచ్చలారని పిల్లలు సైతం ఎక్కువ ఉప్పుని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటని ఎదుర్కొంటున్నారంటూ ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది.