మీడియా ఎందుకు ప్రజల పక్షాన ఉంటుంది, ఎందుకు ఉండాలి? సునామి సంభవించినపుడు నాగపట్నం ప్రాంతానికి తొలుత మీడియా, పిమ్మట స్వచ్ఛంద సంస్థలూ, అటు తర్వాత ప్రభుత్వ వర్గాలు చేరాయి! ఈ క్రమం వాటి వేగాన్ని విశదం చేస్తోంది. గుర్తించిన సమస్యలకు సంబంధించి; వనరులూ ప్రణాళికలను బట్టి ప్రభుత్వ కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయి. ప్రజల సమస్యలు, ప్రభుత్వ చర్యల మధ్య కొంత కాలవ్యవధి తప్పనిసరి. అంతకు మించి ఈ వ్యవధిలో ప్రభుత్వం గుర్తించిన సమస్యలు జటిలం కావచ్చు, మరింత ముప్పుకు దారితీయవచ్చు లేదా కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు. ఇక్కడ సమస్యలను మీడియా గుర్తించాలి. సానుకూల దృక్పథంతో వాటిని ప్రభుత్వానికి నివేదించాలి. ఇందులో వేరే దృష్టి ఉండాల్సిన అవసరం లేదు. ఈ కారణంతో మీడియా ఎల్లప్పుడూ ప్రజల పక్షంగా ఉంటుంది, అవసరమైన చోట ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాలి. ఇది ప్రజాస్వామ్య పోకడ!
ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మీడియా దోహదపడుతుంది. ప్రభుత్వ తీరుతో విబేధిస్తూ, ప్రజలపట్ల సహానుభూతితో వ్యవహరించడం పరిపాటి. ఇటీవల జరిగిన ఎన్నికల తరవాత సాక్షి మీడియా సంస్థలు – ముఖ్యంగా సాక్షి ఛానల్ ఎలా సాగుతుందనే ఆసక్తి కొంతమందికైనా కలిగింది. ఆ ఛానల్ లో ప్రధాన చర్చలు అన్నీ ఆంధ్రప్రదేశ్ విషయాలకే పరిమితమయిపోయాయి. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజులకూ, ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా? భజన కాదు, లేదా భజన అవసరం లేదు అనే రీతిలో అదే ఛానల్లో ఒక కార్యక్రమం ప్రకటన వస్తోంది. ఇది ఎంతో అవసరం కూడా. గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం ధరించడంతో తలెత్తిన సమస్యల గురించి వివరమైన రిపోర్ట్ ఇచ్చారు.
ఒక న్యూస్ ఛానల్ వైఖరి గమనించాలంటే; ఒకటి – హెడ్లైన్స్ తీరూ, రెండు – రిపోర్ట్ ఇచ్చేముందు స్టూడియోనుంచి ఇచ్చే యాంకరింగ్ శైలీ, మూడు – రిపోర్ట్ చేసే తీరూ – పరిశీలించాలి. వానలు, వరదల విషయంలో హెడ్లైన్స్లో ఏమీ తేడా గమనించలేం. ఎందుకంటే అవి పూర్తిగా వాస్తవాలు, ప్రజల అనుభవాలు కనుకా, మరీ ముఖ్యంగా వర్షాలు ఇప్పుడే పడ్డాయి కాబట్టి. ప్రభుత్వ వర్గాలు పనిచేస్తున్నాయా, ప్రజలకు సాయం అందుతోందా? – అనే రీతిలో కాస్త న్యూట్రల్గా, మరికొంత ప్రజల పక్షంగా సుతారంగా అడిగే ప్రశ్నలా మారింది సాక్షి స్టూడియో యాంకరింగ్ స్క్రిప్ట్. ఈ ధోరణి రెండు నెలల కింద కనబడేది కాదు. ఫీల్డ్లో ఉన్న రిపోర్టర్లకు ‘మారిన పోకడ’ తొలుత చేరదు లేదా చేరినా బోధపడదు. కనుక స్టూడియో స్క్రిప్ట్లో మార్పులు చేయడం సులువు. విశ్వసనీయతను గమనించి ఇలాంటి చర్యలు తీసుకోవడం హర్షణీయమే!
ఇంతవరకు సాక్షి ఛానల్ ఒకవైపు, మిగతా మరోవైపు అనేలా ఉండేది. ఇపుడు సాక్షిఛానల్ ఒకవైపు; మూడు (ఈటీవీ, ఏబిఎన్, టీవీ-5) మరోవైపు; మధ్యస్థంగా మిగతా ఛానళ్ళు అనే రీతిలో ఉన్నాయి. వైసిపిని పార్టీని ఖండించే వార్తలు ఈ మూడు ఛానళ్ళలో ప్రముఖంగా ఉంటాయి. టీవీ-9 యాజమాన్యం మారిన తర్వాత సంచలనాల గోల తగ్గింది. అలాగే వైసిపీ మీద అటాక్ కూడా తగ్గింది.
టీవీ-9 మాజీ సిఈఓ రవిప్రకాష్ వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. ఆయన ప్రకటించిన ఛానల్ మొదలయినట్టు లేదు. కానీ ఇంతలో టీవీ-9కు స్ఫూర్తి అయిన ఎన్డిటీవీ ప్రణయ్రాయ్ వార్తల్లోకి వచ్చారు. సిబిఐ కన్నా సుబ్రహ్మణ్యస్వామి వేగమని ఆర్ణబ్ గోస్వామి పోస్ట్ ఫేస్బుక్లో కనబడింది. మీడియా మహానుభావుల లీలల గురించి సోషల్ మీడియాలో వస్తుంది. ప్రణయ్రాయ్కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్టు తాజా సమాచారం. సుబ్రహ్మణ్యస్వామి ఒకటిన్నర సంవత్సరంగా ప్రణయ్రాయ్ పోకడల గురించి సోషల్ మీడియాలో గుర్తుచేస్తున్నారు. నిజానికి ఇది మీడియా పని!
అవినీతిని, అవకతవకలను ప్రశ్నించాల్సిన మీడియా; అధికారానికి, సంపదకు చేరువ కావడం; దానికోసం అవినీతిలో అంతర్భాగం కావడం రాజకీయాలు నడపడం ఇప్పటి పోకడ. సోషల్ మీడియా లేకపోయి ఉంటే ఈ భాగోతాలు సుబ్రహ్మణ్యస్వామి గారికి చెప్పాలని ఉన్నా మనకు తెలిసేవి కాదు; ఆర్ణబ్ గోస్వామి తను మీడియాలో ఉన్నా సాధ్యపడేది కాదు. ప్రణయ్రాయ్ స్ఫూర్తితో రంగంలో దిగిన రవిప్రకాష్ గురువును మించి దూసుకు వెళ్ళడం ఇక్కడ, ఇప్పుడు విశేషం!!
– డా. నాగసూరి వేణుగోపాల్