పీతకష్టాలు పీతవి – లాగా చానళ్ళ కష్టాలు చానళ్ళవి; టీఆర్పి కష్టాలు చానళ్ళ జర్నలిస్టులవి! వర్తమానం గురించీ, సమాజం గురించీ న్యూస్ చానళ్ళు పట్టించుకోవడం లేదని మనం భావిస్తుంటాం. నిజానికి వారికి పోటీ చానళ్ళు చూడటానికీ, ఎదుటివారి టీఆర్పిలు అధిగమించడానికీ ఉన్న సమయం సరిపోవడం లేదు! పోటీ చానల్ ఏది చేస్తే మనం అదే చేద్దాం అనేది ధోరణి! ఒక చానల్లో గరుడపురాణం మొదలైతే, పోటీచానల్ న్యూస్ బులిటిన్ రద్దు చేసి అదే గరుడపురాణ కర్తను ఆహ్వానించి ముందుకు సాగిపోవడం రివాజు. ఈ రకంగా రవిప్రకాష్ సాటి చానళ్ళను కూడా నియంత్రించి శివాజీకి టీఆర్పి పెంచాడని ఇప్పుడు బోధపడుతోంది. రవిప్రకాష్ టీవీ సీరియల్ మొదలై పదిరోజులయినా, ఒక కొలిక్కి రాలేదు, ఆయన పోలీసులకు దొరకలేదు. కానీ అడపాదడపా ఆయన చేసిన టీవీ-9 లీలలు కొంచెం కొంచెం బయటపడుతున్నాయి. నిజానికి తొలిరోజు కొంత హడావుడి చేసినా తర్వాత తర్వాత కొంచెం నిదానించాయి చానళ్ళు. ఇప్పుడు చర్చిస్తే, రేపు మరలా అదే వ్యక్తి ఊరకే ఉండరు కదా అనే శంకా; అలాగే ఆవిషయం గురించి రేవు పెడితే మనం కూడా విమర్శలకు గురికావచ్చు అనే భయమూ – కలసి ఈ సంయమనాన్ని రూపొందించాయి.
తొలిరోజు రెండుమూడు చానళ్ళు విజృంభించి వార్తలివ్వగా, పిమ్మట కొత్త యాజమాన్యం ప్రెస్మీట్ నుంచి మిగతా చానళ్ళు రంగ ప్రవేశం చేశాయి. అయినా ఒక్క చానల్ ఒక్కో తీరుగా స్పందిస్తోంది. ఆరు భాషల లోగోలను కేవలం 99 వేల రూపాయలకు తన సొంత సంస్థకే అమ్మికున్నారన్న వార్తను ఏబిఎన్ కాస్త ఆలస్యంగా ప్రసారం చేసింది. ఇక్కడ సామాన్య ప్రజానీకంతోపాటు జర్నలిస్టులు కూడా సమర్థించలేకపోతున్నారు. ఒకటిన్నర దశాబ్దంపాటు వార్తలు ‘సృష్టిస్తూ’ అగ్రస్థానంలో ఉంటున్న టీవీ-9 లీలలు సాటి జర్నలిస్టులకు బాగా తెలుసు. తెలుగు పత్రికారంగంలో ఈనాడు మీద ఎలా అయితే వ్యతిరేకత కరడుగట్టి ఉందో; అలాగే న్యూస్ చానళ్ళ రంగంలో టీవీ-9 మీదా, ముఖ్యంగా రవిప్రకాష్ మీద తీవ్ర అసంతృప్తి గడ్డకట్టి ఉంది. 2007లో ఐదు వారాల వ్యవధిలో ఎన్టీవీ, టివీ-5 ప్రవేశించినప్పుడు టివి9 ఎలా స్పందించిందో ఇటు వీక్షకులకూ, అటు జర్నలిస్టులకూ తెలుసు. కొత్త కార్యక్రమాలు తాము ప్రారంభిస్తున్నట్టు ఎన్టీవీ ప్రకటించగానే; అవే పేర్లతో అలాంటి కార్యక్రమాలు ప్రారంభించింది టీవీ-9. మార్నింగ్ రాగా అనేది ఒక ఉదాహరణ. అలాగే టీవీ-5 ప్రారంభం సమయం నుంచే రెండు, మూడు రోజులు సిగ్నల్ మాయమైపోయింది. తెరవెనుక ఏమి జరిగిందో కానీ మూడో రోజున చానల్ యజమాని తీవ్ర అసంతృప్తితో ప్రకటనచేస్తూ ఖండించారు. వీక్షకులకు తెలియకపోవచ్చు. కానీ చానళ్ళ జర్నలిస్టులకు బాగా తెలుసు.
కొత్త యాజమాన్యం కింద టీవీ-9లో ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారని జ్యోతిష్యులతో చర్చ పెట్టినప్పుడు టీవీ-9 పాత యాంకర్ తక్కువ మాట్లాడటానికీ, జాగ్రత్తగా మాట్లాడటానికీ ఎంతో కష్టపడ్డారని ఒక పరిశీలన. అలాగే చంద్రబాబు, జగన్ గెలుపు కాదు గానీ – మీ మాజీ సి.ఇ.వో రవిప్రకాష్ ఎక్కడ దాగి ఉన్నాడో జ్యోతిష్యులను వాకబు చేయమని కార్యక్రమం నడుస్తుండగానే సోషల్ మీడియాలో సెటైర్లు. సంచలన సినిమా దర్శకుడు రామగోపాలవర్మ ఎవరెవరి మీదనో బయోపిక్లు తీస్తున్నట్టు ప్రకటించారు గానీ; రవిప్రకాష్ మీద దృష్టిపెడితే సంచలన విజయం ఖాయం. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా టీవీ-9 లీలలు చెబుతారు. టీవీ-9 దేనినీ వదలలేదు – అబ్దుల్కలాం జుట్టు గురించి చవాకులు పేలారు. శోభన్బాబు మరణంతో ఆలిండియా రేటింగులు సంపాదించారు. వారి మహిళా యాంకరుకు పెళ్ళి అయితే పాలగ్లాసుతో వెళ్ళడం దాకా ప్రత్యక్ష ప్రసారమన్నట్టు కార్యక్రమాలు చేశారు. ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి వస్తువుతో వచ్చిన హిందీ సినిమా కన్నా, ఆంగ్ల నవల కన్నా రవిప్రకాష్ గాథ వైవిధ్య భరితం!
మీ మిత్రులను చూపండి. మీరేమిటో చెబుతాం – అని అంటారు. మా వార్తల తీరు చూడండి, మా పార్టీ ఏదో మీరే తెలుసుకోండి అనే రీతిలో చానళ్ళు సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించడానికి ఒక రోజు ముందుగా లగడపాటి రాజగోపాల్ ప్రెస్మీట్ పెట్టి తన సర్వే తీరు దిశ ఏమిటో ప్రకటించారు. ఏడెనిమిది చానళ్ళు దాన్ని లైవ్ ఇచ్చాయి. ఆయన ఆదివారం అందరితోపాటు ప్రకటించి ఉంటే, నలుగురితో నారాయణలా ఉండేది, చానళ్ళ కవరేజి అంత దొరికేది కాదు. ఓట్ల తీరుమీదనే కాదు, చానళ్ళ తీరుమీద కూడా సర్వేచేయకపోయినా అవగాహన ఉంది గనుక ఈ సూక్ష్మం తెలుసుకుని 24 గంటలపాటు – పోలింగ్ సాగుతుండగా లగడపాటి వార్తాంశమయ్యారు.
పగటిపూట మనం ఆశించే భావనలు రాత్రిపూట కలలుగా మారుతాయని సైకాలజిస్టులంటారు. ఇదే రకంగా న్యూస్చానళ్ళు ఇన్నాళ్ళు చెప్పిన వార్తల తీరుగానే ఆ చానల్ ఎగ్జిట్పోల్స్ ఉంటాయి. ఒక పార్టీ చానళ్ళు చూస్తే ఆ పార్టీయే గెలుస్తుందనే అభిప్రాయం కల్గిస్తాయి ఎగ్జిట్పోల్స్ ఫలితాలు! మరో పార్టీచానళ్ళు కూడా అదేరీతిలో, అదే పార్టీ గెలుస్తుందని అంకెలన్నీ సుతారంగా అమరిపోయినట్టు చూపుతూ వివరిస్తాయి. పూర్తిగా బోల్తా కొట్టిన సర్వేలు బోలెడుండగా అప్పుడప్పుడు కొన్ని సర్వేలు తర్వాత ఫలితాలుగా మారుతాయి.
– డా. నాగసూరి వేణుగోపాల్