BJP vs Mamatha: బెంగాల్లో ఎన్నికలు పూర్తి అయినా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ దీదీ మధ్య వార్ కొనసాగుతున్నట్లు కనబడుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమత బెనర్జీకి అధికారాన్ని దూరం చేయాలని బీజేపీ సర్వశక్తులను ఒడ్డినప్పటికీ ఫలితం కనబడలేదు. దీదీ పోటీ చేసిన నందిగ్రామ్ లో అయితే ఓడించారు కానీ రాష్ట్రంలో టీఎంసీ విజయాన్ని బీజేపీ అడ్డుకోలేకపోయింది. అయితే మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ పరిపాలనలో ఇరుకున పెట్టే చర్యలను కేంద్రం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల నారద టేపుల కేసుకు సంబంధించి టీఎంసీ మంత్రులను సీబీఐ అరెస్టు చేసింది. ఆ సమయంలో మమతా బెనర్జీ వారి కోసం సీబీఐ ఆఫీసు వద్దకు వెళ్లి మరీ ఆందోళన చేశారు.
ఇప్పుడు తాజా సీఎస్ వ్యవహారంలో కేంద్రం, రాష్ట్రం మధ్య పేచీ మొదలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాపన్ బంధోపాధ్యాయ్ని రీకాల్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంపై దీదీ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో సీఎస్ను కేంద్రానికి పంపడం కుదరదు అనే తేల్చి చెప్పేసింది. సీఎస్ డిప్యూటేషన్ కు సంబంధించి ప్రదాన మంత్రి మోడీకి మమతా బెనర్జీ లేఖ రాశారు. సీఎస్ ను రిలీవ్ చేయలేమని స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చి రిపోర్టు చేయాలని కేంద్రం పంపిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మోడీని మమత కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి సీఎస్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు కొనసాగిస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలే కొనసాగుతాయని భావించాలని సూచించారు.
Read More: Supreme Court: ఏబీఎన్, టీవీ5 లకు షాక్.. వైసిపీకి కూడా..! తీర్పులో ఏముందంటే..!
ప్రస్తుత సీఎస్ బంధోపాధ్యాయ్ కు ఈ నెల 31 (నేటి)తో 60 ఏళ్లు నిండుతాయి. ఇదే రోజు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని సీఎం మమతా బెనర్జీ ఈ నెల 17 కేంద్రాన్ని అభ్యర్థించారు. కోవిడ్ పోరులో ఆయన సేవలు అవసరమని పేర్కొన్నారు. దీనిపై తొలుత సానుకూలంగా స్పందించిన కేంద్రం ఈ నెల 25న ఆయన పదవి కొనసాగింపునకు అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాలు జారీ చేసిన మూడు రోజులు కాకముందే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. సీఎస్ బంధోపాధ్యాయ్ ను తక్షణం రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీదీ లేఖపై పీఎం మోడీ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదే తరహా వ్యవహారం గతంలో ఏపిలో చోటుచేసుకుంది. గతంలో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న నీలం సాహ్ని పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగించాలని కేంద్రానికి లేఖ రాశారు. అప్పుడు కేంద్రంలోని బీజేపీ అంగీకరించింది. ఆ తరువాత కూడా మరో మూడు నెలల పొడిగింపునకు లేఖ రాస్తే అప్పుడు కూడా కేంద్రం అంగీకరించింది. సీఎం జగన్ లేఖల కారణంగా జూన్ నెలలో పదవీ విరమణ చేయాల్సిన నీలం సాహ్ని డిసెంబర్ వరకూ ఏపి సీఎస్ గా కొనసాగారు. కానీ పశ్చిమ బెంగాల్ వరకు వచ్చే సరికి ఆ పరిస్థితులు లేవు. బీజేపీ అందుకు అంగీకరించే అవకాశాలు కనబడటం లేదు.