కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు ముహూర్తం ఖరారు అయ్యింది. అధ్యక్ష పదవికి ఎన్నికకు షెడ్యుల్ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 22వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ విషయాలను కాంగ్రెస్ ఎంపీ కేసి వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికల తేదీని ఖరారు చేసేందుకు గానూ ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) ఈ రోజు సమావేశమైంది. విదేశాల్లో ఉన్న సోనియా గాంధీ ఈ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించారు. అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 19న ఫలితాల ప్రకటన ఉంటుందని వేణుగోపాల్ తెలిపారు.
సెప్టెంబర్ 24 నుండి 30 మధ్య నామినేషన్లు సమర్పించవచ్చని వేణుగోపాల్ వివరించారు. నామినేషన్లు సమర్పించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల తేదీ ఖరారుతో పాటు పార్టీ చేపట్టదల్చిన పలు కార్యక్రమాలపైనా చర్చించారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ చేపట్టిన హాల్లా బోల్ ర్యాలీని సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్లు మరో సారి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్ర ప్రారంభించే అంశంపైనా చర్చించారు. సోనియా గాంధీ త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.
వైద్య పరీక్షల కోసం సోనియా గాంధీ విదేశాలకు వెళ్లగా ఆమె వెంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్లారు. సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక లు వర్చువల్ గా హాజరైయ్యారు. వీరితో పాటు భేటీలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, జీ 23 నేత ఆనంద్ శర్మ, కాంగ్రెస్ ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీ, కేసి వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, పి చిదంబరం, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లాత్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భఘేల్ తదితర సీడబ్ల్యుసీ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ నేతలు పలువురు వరుసగా రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే రాహుల్ గాంధీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టాలని దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొంటున్నారు. రాహుల్ గాంధీ మరో సారి ఎన్నిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. మరో పక్క రాహుల్ గాంధీ మాత్రం అధ్యక్ష పదవి చేపట్టడానికి సుముఖంగా లేరని వార్తలు వినబడుతున్నాయి. పార్టీ నేతల ఒత్తిడితో మరో సారి అధ్యక్ష పదవిని రాహుల్ చేపడతారా లేక గాంధీ యేతర కుటుంబం నుండి వచ్చిన వారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అనేది వేచి చూడాలి.