Delhi : దేశ రాజధాని ఢిల్లీ మరోమారు సంచలన పరిణామాలతో వార్తల్లోకి ఎక్కింది. త్వరలో డ్రోన్లతో హస్తినలో ఉగ్రదాడి జరగనుందని, ఇందుకు కుట్ర జరిగిందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో డ్రోన్లతో దాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ రాష్ట్ర పోలీసులకు హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపుతోంది.
Read More: Modi: ఓ రికార్డు… ఓ నిరసన.. రెండూ మోడీ పెట్రోల్ ధరల మహిమేనట!
ఢిల్లీలో ఏం జరుగుతోంది?
స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15కు ముందే డ్రోన్లతో భారీ ఉగ్రదాడి జరగొచ్చని దాడి జరగవచ్చని పోలీసులను ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేశాయి. టెర్రరిస్టులు, సంఘ విద్రోహశక్తులు దాడులకు పాల్పడవచ్చని వివరించాయి. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటీవల కశ్మీర్ సరిహద్దుల్లో గుర్తుతెలియని డ్రోన్లు ఎక్కువగా కన్పించాయి. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్థావరం దగ్గర డ్రోన్ దాడి తీవ్ర కలకలం రేపింది. దీంతో కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. తాజా హెచ్చరికల నేపథ్యంలో మరింతగా అప్రమత్తం అయి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Read More: Modi: మోడీకి అసలు పరీక్ష నేటి నుంచే… ఎవరిది పై చేయి కానుంది?
గణేష్ నవరాత్రులపై స్పెషల్ ఫోకస్
ఢిల్లీలో త్వరలో జరుగనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలపై కూడా నిఘా పెంచాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులు ఇప్పటికే తగుఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించాలని, చెక్పోస్టుల దగ్గర భద్రతలను మరింత పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్లోనూ పాక్ చొరబాట్లకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుండటంతో సరిహద్దుల వెంట కూడా భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.