కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో అఖండ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ .. కర్ణాటక సీఎం అభ్యర్ధి ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ద రామయ్య లు సీఎం రేసులో ఉండటంతో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. నిన్నటి సమావేశంలో సీఎం అభ్యర్ధి ఎంపిక అధిష్టానం నిర్ణయానికి వదిలివేస్తూ తీర్మానించారు. అయితే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వారికే సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో సీఎల్పీ సమావేశం నిర్వహించి 135 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల బృందం నివేదికను సిద్దం చేసింది.
ఈ నివేదికను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు భన్వర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ రోజు ఢిల్లీలో ఖర్గేకి పరిశీలకుల బృందం నివేదిక అందించనున్నది. అనంతరం పార్టీ అధిష్టానం కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రకటించనున్నది. ఈ నెల 18న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్ధిని ఎప్పుడు ప్రకటిస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ ఢిల్లీకి వెళుతున్నట్లుగా వార్తలు రాగా, ఆయన తనకు అధిష్టానం నుండి ఎలాంటి పిలుపు రాలేదని తెలిపారు. సిద్దా రామయ్య ఢిల్లీ వెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
అయితే అభిప్రాయ సేకరణలో మెజార్టీ ఎమ్మెల్యే లు సిద్ద రామయ్యకే మొగ్గు చూపినట్లుగా సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు 80 మంది ఆయనకే మద్దతు ప్రకటించారు. ఓటింగ్ లో సిద్ద రామయ్య ముందుండగా, ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ వెనుకబడ్డట్లు సమాచారం. దీంతో కాబోయే సీఎం సిద్దరామయ్యేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Breaking: ఘోర రోడ్డు ప్రమాదం .. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి